IPL 2024 RCB VS KKR: చరిత్ర సృష్టించనున్న సునీల్‌ నరైన్‌

29 Mar, 2024 15:32 IST|Sakshi

ఐపీఎల్‌ 2024లో భాగంగా ఆర్సీబీతో ఇవాళ (మార్చి 29) జరుగబోయే మ్యాచ్‌తో కేకేఆర్‌ స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ సునీల్‌ నరైన్‌ చరిత్ర సృష్టించనున్నాడు. ఈ మ్యాచ్‌తో నరైన్‌ టీ20ల్లో 500 మ్యాచ్‌ల మైలురాయిని తాకబోతున్నాడు. ప్రపంచ క్రికెట్‌లో కేవలం ముగ్గురు​ మాత్రమే నరైన్‌కు ముందు ఈ మైలురాయిని తాకారు.

వీరిలో కీరన్‌ పోలార్డ్‌ అందరికంటే ఎక్కువగా 660 మ్యాచ్‌లు ఆడగా.. డ్వేన్‌ బ్రావో 573, షోయబ్‌ మాలిక్‌ 542 మ్యాచ్‌లు ఆడారు. టీ20ల్లో అత్యంత అరుదైన క్లబ్‌లో చేరబోతున్న నరైన్‌.. ఈ ఫార్మాట్‌లో ఇప్పటివరకు 499 మ్యాచ్‌లు ఆడి 536 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లో 3736 పరుగులు చేశాడు. 2011లో టీ20 ఫార్మాట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నరైన్‌ చాలా రికార్డుల్లో భాగంగా ఉన్నాడు. 

  • టీ20ల్లో అత్యధిక మెయిడిన్లు (30) వేసిన బౌలర్‌గా..
  • టీ20ల్లో మూడో అత్యధిక వికెట్‌ టేకర్‌గా (536)..
  • కనీసం 2000 బంతులు బౌల్‌ చేసిన వారిలో రెండో అత్యధిక ఎకానమీ రేట్‌ (6.10) కలిగిన బౌలర్‌గా.. 
  • పవర్‌ ప్లేల్లో నాలుగో అత్యుత్తమ స్ట్రయిక్‌రేట్ (155.05) కలిగిన బ్యాటర్‌గా..
  • టీ20ల్లో అత్యధిక టైటిళ్లలో (10) భాగమైన నాలుగో ఆటగాడిగా పలు రికార్డుల్లో తన పేరును లిఖించుకున్నాడు. 

మ్యాచ్‌ విషయానికొస్తే.. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తమ సొంత మైదానమైన చిన్నస్వామి స్టేడియంలో ఇవాళ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు గెలుపు కోసం కొదమ సింహాల్లా పోరాడనున్నాయి. కేకేఆర్ తమ తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను మట్టికరిపించి జోష్‌లో ఉండగా.. ఆర్సీబీ తమ చివరి మ్యాచ్‌లో (రెండోది) పంజాబ్‌ కింగ్స్‌కు షాకిచ్చి నూతనోత్సాహంతో ఉరకలేస్తుంది. 
 

Election 2024

మరిన్ని వార్తలు