-

Ishan Kishan: కోహ్లి పట్టుకోగానే దుఃఖం ఆపుకోలేకపోయాడు..  అందుకేనా!

27 Sep, 2021 20:02 IST|Sakshi
Courtesy: IPL Twitter

Ishan Kishan Emotional After Virat Kohli Console.. ముంబై ఇండియన్స్‌ యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ ఎమోషనల్‌ అయ్యాడు. ఆర్‌సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అతన్ని పట్టుకొని ధైర్యం చెబుతుండగానే ఒక్కసారిగా దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వాస్తవానికి ఇషాన్‌ కిషన్‌ ముంబై ఇండియన్స్‌ జట్టులో ప్రధాన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. 2020 ఐపీఎల్‌ సీజన్‌లో ఇషాన్‌ కిషన్‌ 500 పరుగుల క్లబ్‌ను కూడా అందుకొని టీమిండియా సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. అయితే ఈసారి సీజన్‌లో మాత్రం ఇషాన్‌ వరుసగా విఫలమవుతూ వస్తున్నాడు. తాజాగా ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో తొమ్మిది పరుగులు మాత్రమే చేసి చహల్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. తన ఆటతీరుపై పెవిలియన్‌కు వెళ్లాకా చాలా బాధపడ్డాడు.  అయితే మ్యాచ్‌ ముగిసిన తర్వాత టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఇషాన్‌ కిషన్‌ను బాధపడొద్దంటూ ఓదార్చి క్రీడాస్పూర్తిని చాటాడు. ఈ నేపథ్యంలో మాటల సందర్భంగా కోహ్లి ఇషాన్‌పై చేతులు వేసి ధైర్యం చెప్పే ప్రయత్నం చేయగా.. అతను కన్నీటిని దిగమింగుకున్నాడు.  

చదవండి: Kohli-Rohit Rift: వాళ్లిద్దరి మధ్య విభేదాలా!.. మరోసారి నిరూపితమైంది


Courtesy: IPL Twitter

వాస్తవానికి ఇషాన్‌ కిషన్‌తో పాటు మరో ముంబై ప్రధాన బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌.. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాలు కూడా విఫలమవుతూనే ఉన్నారు. కాగా ఈ ముగ్గురు టి20 ప్రపంచక్‌ప్‌కు టీమిండియా జట్టులో ఎంపికైన సంగతి తెలిసిందే. కాగా వీరి ఫామ్‌పై ఆందోళన చెందుతున్న బీసీసీఐ టీమిండియా జట్టులో వేరే ఆటగాళ్లను(అయ్యర్‌, శాంసన్‌, మయాంక్‌ అగర్వాల్‌) తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ఇషాన్‌ కిషన్‌ తను టి20 జట్టులో స్థానం ఎక్కడ కోల్పోతానన్న భయంతోనే ఎమోషనల్‌ అయ్యాడా అని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు.

చదవండి: IPL 2021: ఒక్క మ్యాచ్‌ ఆడకుండానే వెనుదిరిగాడు!

కాగా ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 55 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే.  ముందుగా బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (37 బంతుల్లో 56; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), విరాట్‌ కోహ్లి (42 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలు సాధించగా, ఆంధ్ర క్రికెటర్‌ కోన శ్రీకర్‌ భరత్‌ (24 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. బుమ్రాకు 3 వికెట్లు దక్కాయి. 

అనంతరం ముంబై 18.1 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది. రోహిత్‌ శర్మ (28 బంతుల్లో 43; 5 ఫోర్లు, 1 సిక్స్‌) ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. హర్షల్‌ పటేల్‌ (4/17) ‘హ్యాట్రిక్‌’తో చెలరేగగా... చహల్‌ 3, మ్యాక్స్‌వెల్‌ 2 వికెట్లు తీశారు. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌లలోనూ బెంగళూరు గెలవడం విశేషం. మ్యాచ్‌ ఓటమితో ముంబై ఇండియన్స్‌ పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి పడిపోయి లీగ్‌లో ముందంజ వేసే అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. మరోవైపు తాజా విజయంతో ఆర్‌సీబీ రెండు వరుస పరాజయాలకు బ్రేక్‌ వేసి  మూడో స్థానంలో ఉంది.

మరిన్ని వార్తలు