IND vs ENG: 'అతడు చాలా డేంజర్‌.. ఇంగ్లండ్‌ గెలవాలంటే అదొక్కటే మార్గం'

9 Jan, 2024 19:20 IST|Sakshi

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌ 2023-25లో తొలి హోమ్ సిరీస్‌కు టీమిండియా సన్నద్దం కానుంది. స్వదేశంలో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్‌తో భారత జట్టు తలపడనుంది. జనవరి 25న హైదరాబాద్‌ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఇటీవల కాలంలో టెస్టు క్రికెట్‌లో దుమ్మురేపుతున్న ఇంగ్లండ్‌ను భారత్ ఏ విధంగా బ్రేక్‌లు వేస్తుందో వేచి చూడాలి.

అయితే టెస్టుల్లో సొంత గడ్డపై భారత్‌కు ఘనమైన రికార్డు ఉంది. 2013 నుంచి స్వదేశంలో 46 టెస్టులు ఆడిన టీమిండియా కేవలం మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓటమి పాలైంది. కానీ ఒక్క టెస్టు సిరీస్‌ను భారత్‌ కోల్పోలేదు. కాగా ఈ హైవోల్టేజ్‌ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ రోహిత్‌ శర్మపై ప్రశంసల వర్షం కురిపించాడు.

"భారత బ్యాటర్లు స్పిన్‌కు అద్బుతంగా ఆడుతారు. టర్నింగ్‌ పిచ్‌లపై వారు ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగుతారు. ముఖ్యంగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. స్పిన్‌ పిచ్‌లపై పండగ చేసుకుంటాడు. టర్నింగ్ పిచ్‌లలో డాన్ బ్రాడ్‌మాన్‌లా హిట్‌మ్యాన్‌  ఆడుతాడు. అతడి రికార్డు అద్బుతం.  టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్‌ విజయం సాధించాలంటే రోహిత్‌ను ముందుగానే ఔట్ చేయాలి.

రోహిత్‌ దూకుడుకు అడ్డుకట్ట వేస్తే భారత్‌ కొంచెం ఒత్తిడిలోకి వెళ్తుందని" హిందూస్తాన్‌ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  పనేసర్‌ పేర్కొన్నాడు. కాగా స్వదేశంలో రోహిత్‌కు టెస్టుల్లో మం‍చి రికార్డు ఉంది. 36 ఇన్నింగ్స్‌లలో 66.73 సగటుతో 2002 పరుగులు చేశాడు.
చదవండిAUS vs PAK: 'అతడు ఓపెనర్‌గా వస్తే.. లారా 400 పరుగుల రికార్డు బద్దలవ్వాల్సిందే'

>
మరిన్ని వార్తలు