IPL 2021: అదంతా చిన్నతనం.. క్రికెట్‌ కంటే గొడవలపై ఎక్కువ ఆసక్తి

30 Sep, 2021 17:12 IST|Sakshi
Courtesy: IPL Twitter

Rishab Pant And Shryeas Iyer Shares Childhood Memories.. అంతర్జాతీయ, దేశవాలీ క్రికెట్‌లో అంటే వికెట్లు ఉంటాయి.. అదే గల్లీ క్రికెట్‌ అంటే రాళ్లు, ఇటుకలు లేదంటే గోడలే వికెట్లుగా పెట్టుకొని ఆడడం చూస్తుంటాం. కాస్త ఖాళీ ప్రదేశం దొరికితే చాలు.. వెంటనే రాళ్లు పెట్టి క్రికెట్‌ ఆడడం మనకు బాగా అలవాటైపోయింది. తరాలు మారినా గల్లీ క్రికెట్‌లో మాత్రం ఎప్పటికీ మార్పు రాలేదు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్ రిషబ్‌ పంత్‌తో పాటు శ్రేయాస్‌ అయ్యర్‌ తమ చిన్ననాటి క్రికెట్‌ స్మృతులను గుర్తుచేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోనూ ఢిల్లీ క్యాపిటల్స్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది.

చదవండి: IPL 2021: వారెవ్వా రియాన్‌ పరాగ్‌.. బులెట్‌ కంటే వేగంగా


Courtesy: IPL Twitter

''మా ఇంటికి కొద్ది దూరంలోనే విశాలమైన మైదానం ఉంది. ఆ పక్కనే ఒక కన్‌స్ట్రక‌్షన్‌ సైట్‌ ఉండేది. నా స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్లి దొంగతనంగా ఇటుకలు ఎత్తుకొచ్చేవాళ్లం. వాటిని మైదానంలో​ అడ్డంగా పెట్టి వికెట్లుగా తయారుచేసి క్రికెట్‌ ఆడుకునేవాళ్లం. అంతేకాదు చిన్నప్పుడు నా వద్దనే బ్యాట్‌ ఉండేది. పొరపాటున నేను ఔటయ్యానో నా బ్యాట్‌ పట్టుకొని ఇంటికి పారిపోయేవాడిని. నన్ను వెతుక్కుంటూ నా స్నేహితులు ఇంటికి వచ్చేవారు. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే నవ్వొస్తోంది.'' అంటూ రిషబ్‌ పంత్‌ చెప్పుకొచ్చాడు. 


Courtesy: IPL Twitter

ఇక అయ్యర్‌ మాట్లాడుతూ.. '' నా చిన్నప్పుడు క్రికెట్‌ కంటే ఆటలో జరిగే గొడవలపై ఎక్కువ ఆసక్తి చూపేవాడిని. తెలిసి తెలియని వయసులో క్రికెట్‌ ఆడుతున్న సమయంలో ఎవరో ఒకరు చీటింగ్‌ చేసి ఆడేవారు. అది జీర్ణించుకోలేని మిగతావారు అతన్ని టార్గెట్‌ చేస్తూ ఫైట్‌ చేసుకునేవారు. ఎంతైనా చిన్ననాటి జ్ఞాపకాలు ఎ‍ప్పటికి మధురంగానే ఉంటాయి.'' అని పేర్కొన్నాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌ ఈ సీజన్‌లోనూ అదరగొడుతుంది. ఆడిన 11 మ్యాచ్‌ల్లో​ 8 విజయాలు.. 3 ఓటములతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. టైటిల్‌ ఫెవరెట్లలో ఒకటిగా కనిపిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ ఐపీఎల్‌ టైటిల్‌ను గెలవాలనే సంకల్పంతో ఉంది.

చదవండి: RR Vs RCB: ముస్తాఫిజుర్ రెహ్మాన్ సూపర్‌ ఫీల్డింగ్‌.. వావ్ అంటున్న ఫ్యాన్స్

మరిన్ని వార్తలు