టీమిండియా కోచింగ్ బాధ్యతల నుంచి తప్పుకున్న తరువాత క్రికెట్ వ్యాఖ్యానంలో బిజీ అయిపోయిన రవిశాస్త్రి.. ప్రస్తుతం ఐపీఎల్ 2022 సీజన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య సోమవారం (మార్చి 28) జరిగిన మ్యాచ్కు కామెంటేటర్గా వ్యవహరించిన ఆయన.. ఐపీఎల్ వేలానికి సంబంధించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ జమానాలో ఐపీఎల్ ఉండివుంటే కనీసం 15 కోట్లు కొల్లగొట్టేవాడినంటూ వ్యాఖ్యానించాడు. ఒకవేళ తాను ఏ జట్టుకైనా నాయకత్వం వహించాల్సి వచ్చివుంటే అంతకుమించి ధర పలికి ఉండేవాడినంటూ గొప్పలు పోయాడు.
లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్గా కెరీర్ మొదలు పెట్టిన రవిశాస్త్రి.. ఆ తర్వాత ఓపెనర్గా మారి, నాటి టీమిండియాలో కీలక ఆల్రౌండర్గా ఎదిగిన అందరికీ సంగతి తెలిసిందే. టీమిండియా తరఫున 80 టెస్ట్లు, 150 వన్డేలు ఆడిన ఆయన.. 1983 వన్డే వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. రవిశాస్త్రి తన టెస్ట్ కెరీర్లో 11 సెంచరీలు, 12 అర్ధ సెంచరీల సాయంతో 3830 పరుగులు, వన్డేల్లో 4 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీల సాయంతో 3108 పరుగులు సాధించాడు. అలాగే శాస్త్రి.. టెస్ట్ల్లో 151 వికెట్లు, వన్డేల్లో 129 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: IPL 2022 GT vs LSG: అరె తమ్ముడు.. సారీ రా! పర్లేదు మేము మ్యాచ్ గెలిచాం కదా!