ISPL 2024: అక్షయ్‌ కుమార్‌ బౌలింగ్‌లో సిక్సర్‌ బాదిన సచిన్‌ టెండూల్కర్‌

6 Mar, 2024 20:10 IST|Sakshi

లోకల్‌ టాలెంట్‌ను వెలికి తీసి సాన పెట్టడమే లక్ష్యంగా పురుడుపోసుకున్న ఇండియన్‌ స్ట్రీట్‌ ప్రీమియర్‌ టీ10 లీగ్‌ (ఐఎస్‌పీఎల్‌)  ఇవాళ (మార్చి 6) ప్రారంభమైంది. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పోటీపడనుండగా.. ఈ జట్లను టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ తారలు కొనుగోలు చేశారు.

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ఫాల్కన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టును కొనుగోలు చేయగా.. బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ మఝీ ముంబైను.. అక్షయ్‌ కుమార్‌ శ్రీనగర్‌ వీర్‌ను.. హృతిక్‌ రోషన్‌ బెంగళూరు స్ట్రయికర్స్‌ను.. సైఫ్‌ అలీ ఖాన్‌-కరీనా కపూర్‌ టైగర్స్‌ ఆఫ్‌ కోల్‌కతాను.. తమిళ సూపర్‌ స్టార్‌ సూర్య చెన్నై సింగమ్స్‌ జట్లను కొనుగోలు చేశారు.

ఐఎస్‌పీఎల్‌ ప్రారంభానికి ముందు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌, సూర్య, అక్షయ్‌ కుమార్‌లతో కలిసి హైదరాబాద్‌ జట్టు ఓనర్‌ రామ్‌చరణ్‌ సందడి చేశారు.చెర్రీ వీరందరితో ట్రిపుల్‌ ఆర్‌ ఫేమ్‌ నాటు నాటు పాటకు స్టెప్పులేయించాడు. 

అనంతరం సచిన్‌ సారథ్యంలోని టీమ్‌ మాస్టర్స్‌ ఎలెవెన్‌ జట్టు..  అక్షయ్‌ కుమార్‌ నేతృత్వంలోని టీమ్‌ ఖిలాడీతో ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడింది. ఈ మ్యాచ్‌లో సచిన్‌.. అమిర్‌ హుసేన్‌ అనే  దివ్యాంగ క్రికెటర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ప్రారంభించాడు. అక్షయ్‌ కుమార్‌ వేసిన తొలి ఓవర్‌లోనే సచిన్‌ భారీ సిక్సర్‌ బాదాడు.

దీనికి సంబంధించిన వీడయో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. కాగా, ఈ ప్రాకీస్‌ మ్యాచ్‌ అనంతరం లీగ్‌ తొలి మ్యాచ్‌ మొదలైంది. రాత్రి 7 గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో అమితాబ్‌ జట్టు మఝీ ముంబై.. అక్షయ్‌ కుమార్‌ జట్టైన శ్రీనగర్‌ వీర్‌తో తలపడుతుంది. 

whatsapp channel

మరిన్ని వార్తలు