SMAT 2023: ఆంధ్ర ఆటగాడి వీరోచిత పోరాటం.. భారీ లక్ష్య ఛేదనలో శతక్కొట్టుడు

18 Oct, 2023 12:11 IST|Sakshi

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీ 2023లో భాగంగా పంజాబ్‌తో నిన్న (అక్టోబర్‌ 17) జరిగిన మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌ ఆటగాడు రికీ భుయ్‌ వీరోచితంగా పోరాడాడు. భారీ లక్ష్య ఛేదనలో భుయ్‌ అజేయ శతకంతో (52 బంతుల్లో 104; 6 ఫోర్లు, 9 సిక్సర్లు) మెరిశాడు. అతనికి మరో ఎండ్‌ నుంచి ఎలాంటి సహకారం లభించకపోవడంతో ఈ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌ ఓటమిపాలైంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌.. అభిషేక్‌ శర్మ (51 బంతుల్లో 112; 9 ఫోర్లు, 9 సిక్సర్లు), అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌ (26 బంతుల్లో 87; 6 ఫోర్లు, 9 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 275 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్‌గా రికార్డుల్లోకెక్కింది.

అనంతరం కష్ట సాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన ఆంధ్రప్రదేశ్‌.. పంజాబ్‌ బౌలర్లు హర్ప్రీత్‌ బ్రార్‌ (4-1-18-3), సిద్దార్థ్‌ కౌల్‌ (2/40), అర్షదీప్‌ సింగ్‌ (1/37), ప్రేరిత్‌ దత్తా (1/25) ధాటికి 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 170 పరుగులకే పరిమితమైంది. ఆంధ్ర ఇన్నింగ్స్‌లో రికీ భుయ్‌ (104 నాటౌట్‌) ఒక్కడే ఒంటిపోరాటం చేసి శతక్కొట్టగా.. అశ్విన్‌ హెబ్బర్‌ (17), త్రిపురన విజయ్‌ (23) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. 
 

మరిన్ని వార్తలు