T20 World Cup 2022: స్టొయినిస్‌ విధ్వంసం.. లంకపై ఆసీస్‌ ఘన విజయం

25 Oct, 2022 20:32 IST|Sakshi

టీ20 వరల్డ్‌కప్‌-2022లో భాగంగా శ్రీలంకతో ఇవాళ (అక్టోబర్‌ 25) జరిగిన సూపర్‌-12 గ్రూప్‌-1 మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీపావళి తర్వాతి రోజు స్టార్‌ ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టొయినిస్‌ రాకెట్‌ ఇన్నింగ్స్‌ ఆడి ఆసీస్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. స్టొయినిస్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో పెర్త్‌ మైదానం దద్దరిల్లింది. స్టొయినిస్‌ పూనకం వచ్చినట్లు రెచ్చిపోయి కేవలం 17 బంతుల్లోనే అర్ధసెంచరీ బాదాడు. లంక నిర్ధేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో స్టొయినిస్‌ మెరుపు హాఫ్‌ సెంచరీతో (18 బంతుల్లో 59 నాటౌట్‌; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) లంక బౌలర్లను చీల్చిచెండాడు. ఫలితంగా ఆసీస్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక పథుమ్‌ నిస్సంక (45 బంతుల్లో 40; 2 ఫోర్లు), అసలంక (25 బంతుల్లో 38 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ధనంజయ డిసిల్వా (23 బంతుల్లో 26; 3 ఫోర్లు), చమిక కరుణరత్నే (7 బంతుల్లో 14 నాటౌట్‌; 2 ఫోర్లు) ఓ మోస్తరుగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఆసీస్‌ బౌలర్లు హేజిల్‌వుడ్‌, కమిన్స్‌, స్టార్క్‌, అగర్‌, మ్యాక్స్‌వెల్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో పాటు తలో వికెట్‌ పడగొట్టడంతో శ్రీలంక నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది.

అనంతరం 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్‌.. ఆరంభంలోనే డేవిడ్‌ వార్నర్‌ (11), మిచెల్‌ మార్ష్‌ (17) వికెట్లు కోల్పోయి తడబడినప్పటికీ.. కెప్టెన్‌ ఫించ్‌ (42 బంతుల్లో 31 నాటౌట్‌; సిక్స్‌), మ్యాక్స్‌వెల్‌ (12 బంతుల్లో 23; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే 13 ఓవర్‌లో మ్యాక్సీ ఔట్‌ కావడంతో బరిలోకి దిగిన స్టొయినిస్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. స్టొయినిస్‌ విధ్వంసం ధాటికి ఆసీస్‌ 16.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.  
చదవండి: రాణించిన బౌలర్లు.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన శ్రీలంక

Poll
Loading...
మరిన్ని వార్తలు