T20 WC 2022: మెల్‌బోర్న్‌లో వెయిట్‌ చేస్తుంటాం.. రండి, తేల్చుకుందాం.. టీమిండియాకు అక్తర్‌ సవాల్‌

10 Nov, 2022 08:00 IST|Sakshi

టీ20 వరల్డ్‌కప్‌-2022లో భాగంగా నిన్న  (నవంబర్‌ 9) జరిగిన తొలి సెమీఫైనల్లో పాకిస్తాన్‌.. న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించి 13 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు పటిష్టంగా కనిపించిన న్యూజిలాండ్‌.. నాకౌట్‌ మ్యాచ్‌లో ఒత్తిడికి గురై, స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక, అదృష్టం కొద్దీ సెమీస్‌కు చేరిన పాకిస్తాన్‌ చేతిలో ఓటమిపాలైంది.

బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌, బౌలింగ్‌.. ఇలా అన్ని విభాగాల్లో పేలవ ప్రదర్శన కనబర్చిన కివీస్‌.. మెగా టోర్నీల్లో పాక్‌ చేతిలో చిత్తయ్యే సంప్రదాయాన్ని కొనసాగించింది. మరోవైపు ఇవాళ (నవంబర్‌ 10) జరిగే రెండో సెమీఫైనల్లో టీమిండియా-ఇంగ్లండ్‌ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. రసవత్తరంగా సాగుతుందని భావిస్తున్న ఈ మ్యాచ్‌ ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో విజేత నవంబర్‌ 13న మెల్‌బోర్న్‌ వేదికగా జరిగే టైటిల్‌ పోరులో పాకిస్తాన్‌తో తలపడుతుంది.

ఈ నేపథ్యంలో టీమిండియాను ఉద్దేశిస్తూ పాక్‌ మాజీ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సెమీస్‌ మ్యాచ్‌ కోసం టీమిండియాకు గుడ్‌ లక్‌ చెబుతూనే.. మరో రసవత్తర సమరం కోసం మెల్‌బోర్న్‌లో వెయిట్‌ చేస్తుంటామంటూ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్‌ ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. భారత అభిమానులు అక్తర్‌ ట్వీట్‌పై తగు రీతిలో స్పందిస్తున్నారు.

ఏదో అదృష్టం కలిసొచ్చి సెమీస్‌కు చేరిన మీకు అంత బిల్డప్‌ అవసరమా.. కొంచెం ఓపిక పట్టు.. వస్తున్నామంటూ కౌంటరిస్తున్నారు. అప్పుడే ఏమైంది అక్తర్‌.. ఇవాళ ఇంగ్లండ్‌ను ఓడించి, ఫైనల్లో మీ తాట తీస్తామంటూ ఘాటుగా బదులిస్తున్నారు. ఇంకొందరైతే.. ఫైనల్లో న్యూజిలాండ్‌ అయితే టీమిండియాకు కాస్త ఇబ్బంది అయ్యేదేమో, మీరైతే అస్సలు టెన్షన్‌ పడాల్సి అవసరం లేదు, ఆడుతూ పాడుతూ మీ ఆట కట్టిస్తామంటూ కామెంట్లు చేస్తున్నారు.
 

Poll
Loading...
మరిన్ని వార్తలు