Jos Buttler: ఆ ఓవర్‌ అసాధారణం.. అతడికి ఎప్పుడు బంతిని అప్పగించినా: బట్లర్‌ ప్రశంసలు

14 Nov, 2022 12:50 IST|Sakshi

ICC Mens T20 World Cup 2022 - Pakistan vs England, Final: ‘‘చాలా గర్వంగా ఉంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో కొన్ని మార్పులు.. వాటి ఫలితాలు ఇప్పుడు అందుకుంటున్నాం. టోర్నీ చాలా అద్భుతంగా సాగింది. ఐర్లాండ్‌ చేతిలో ఓటమి అసలు ఎప్పుడు ఎదురైందో అనిపిస్తోంది. కోచ్‌ మాథ్యూ మాట్‌ కూడా పూర్తి స్వేచ్ఛనిచ్చి మేం అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రోత్సహించారు.

స్టోక్స్‌ పోరాటయోధుడు. తన అనుభవంతో అతను ఏదైనా చేయగలడు. కీలక సమయాల్లో రాణించడమే స్టోక్స్‌ గొప్పతనం. నాలుగున్నర నెలల కెప్టెన్సీలోనే ప్రపంచకప్‌ దక్కిందనే ఆనందాన్ని మాటల్లో వర్ణించలేకపోతున్నాను’’ అంటూ ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్ హర్షం వ్యక్తం చేశాడు.

ప్రపంచకప్‌ టోర్నీ ఆరంభానికి ముందు జరిగిన పాకిస్తాన్‌ పర్యటన తమ ఆటగాళ్లందరూ బాగా కలిసిపోయేందుకు ఉపకరించిందని పేర్కొన్నాడు. కాగా టీ20 వరల్డ్‌కప్‌-2022 ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి ఇంగ్లండ్‌ ట్రోఫీ గెలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం బట్లర్‌ మాట్లాడుతూ.. తమ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లను అభినందించాడు. ఈ మ్యాచ్‌లో ఆదిల్‌ రషీద్‌ ఓవర్‌ అసాధారణమని.. అతనికి ఎప్పుడు బంతిని అప్పగించినా ఏదో ఒకటి చేసి చూపిస్తాడంటూ ప్రశంసలు కురిపించాడు.

ఆ ఓవర్‌ స్పెషల్‌
కాగా పాక్‌ ఇన్నింగ్స్‌లో 12వ ఓవర్‌ మొదటి బంతికే కెప్టెన్‌, ప్రమాదకర బ్యాటర్‌ బాబర్‌ ఆజం అవుట్‌ చేసిన ఆదిల్‌ రషీద్‌.. ఓవర్‌ మొత్తంలో ఒక్క పరుగు(మెయిడెన్‌) కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆదిల్‌ను ఉద్దేశించి బట్లర్‌ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.

అదే విధంగా ఆల్‌రౌండర్‌ స్టోక్స్‌ను కొనియాడాడు. కాగా పాక్‌తో ఫైనల్లో ఆదిల్‌ రషీద్‌ తన నాలుగు ఓవర్ల బౌలింగ్‌ కోటా పూర్తి చేసి 22 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. ఇక స్టోక్స్‌ విషయానికొస్తే.. ఒక వికెట్‌ తీయడంతో పాటుగా అజేయ అర్ధ శతకంతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. 

ప్రేక్షకులంతా మాకు మద్దతు పలికేందుకే వచ్చినట్లుంది
ఇంగ్లండ్‌ జట్టుకు అభినందనలు. మైదానంలో ప్రేక్షకులంతా మాకు మద్దతు పలికేందుకే వచ్చినట్లుంది. అందరికీ కృతజ్ఞతలు. గత నాలుగు మ్యాచ్‌లలో మా జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఫైనల్లో స్వేచ్ఛగా ఆడాలని మా ఆటగాళ్లకు చెప్పాను.

కనీసం 20 పరుగులు తక్కువగా చేసినా చివరి వరకు పోరాడగలిగాం. మా బౌలింగ్‌ అత్యుత్తమమైంది. అఫ్రిదికి మధ్యలో గాయం కావడం కూడా మాకు ఇబ్బందిగా మారింది. అయితే అదంతా ఆటలో భాగం’’ అని పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం మ్యాచ్‌ అనంతరం వ్యాఖ్యానించాడు.

చదవండి: టీ20 వరల్డ్‌కప్‌-2022 అత్యుత్తమ జట్టులో ఇద్దరు టీమిండియా క్రికెటర్లు    
T20 WC 2022 Final: బాబర్‌కు ఊహించని ప్రశ్న.. మధ్యలో తలదూర్చిన మేనేజర్‌

A post shared by ICC (@icc)

మరిన్ని వార్తలు