అదే మా కొంపముంచింది.. వారు మాత్రం అద్భుతం: న్యూజిలాండ్‌ కెప్టెన్‌

23 Oct, 2023 13:19 IST|Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో న్యూజిలాండ్‌ తొలి ఓటమి చవిచూసింది. ధర్మశాల వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో కివీస్‌ ఓటమి పాలైంది. 274 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడంలో న్యూజిలాండ్‌ బౌలర్లు సఫలం కాలేదు. ఈ మెగా టోర్నీలో తమ తొలి ఓటమిపై మ్యాచ్‌ అనంతర కివీస్‌ కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌ స్పందించాడు.

తమ బ్యాటింగ్‌లో ఆఖరి 10 ఓవర్లను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయామని లాథమ్‌ తెలిపాడు. "ఈ మ్యాచ్‌లో మా బాయ్స్‌ ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నాను. కానీ బ్యాటింగ్‌లో కాస్త తడబడ్డాం. మేము చివరి 10 ఓవర్లలో పెద్దగా పరుగులు సాధించలేకపోయాము. మా స్కోర్‌ బోర్డ్‌లో మరో 30 నుంచి 40 పరుగులు తక్కువ అయ్యాయి.

కానీ ఆఖరిలో భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. కాబట్టి క్రెడిట్‌ మొత్తం వారికే. రాచిన్ రవీంద్ర, మిచెల్‌ మాకు అద్భుతమైన భాగస్వామ్యాన్ని అందించారు. కానీ దాన్ని మేము వినియోగించుకోలేకపోయాం. మిచెల్‌ మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు.

భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. ఇక మా బౌలర్లు కూడా అద్భుతంగా పోరాడారు. ఆటలో గెలుపు ఓటములు సహజం. మా జట్టు ప్రస్తుతం సమతుల్యంగా ఉంది. మా తదుపరి మ్యాచ్‌ల్లో మేము మరింత మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తామని" పోస్ట్‌ మ్యాచ్‌ ప్రేజేంటేషన్‌లో లాథమ్‌ పేర్కొన్నాడు.
చదవండి: చాలా సంతోషంగా ఉంది.. చిన్న చిన్న తప్పులు సహజం! అతడొక మాస్టర్‌ క్లాస్‌: రోహిత్‌ శర్మ

మరిన్ని వార్తలు