IPL 2024: ధోనితో మీటింగ్‌.. ఐపీఎల్‌-2024లో సీఎస్‌కేకు ఆడనున్న సంజూ?!

19 Oct, 2023 15:29 IST|Sakshi

Sanju Samson- MS Dhoni: టీమిండియా క్రికెటర్‌ సంజూ శాంసన్‌ గురించి ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇది నిజమైతే బాగుండని అభిమానులు కూడా క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ విషయమేమింటే..  వన్డే వరల్డ్‌కప్‌-2023 జట్టులో కేరళ బ్యాటర్‌ సంజూ శాంసన్‌కు చోటు దక్కని విషయం తెలిసిందే.

ఈ క్రమంలో దేశవాళీ క్రికెట్‌ మీద దృష్టి సారించి ఈ వికెట్‌ కీపర్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ-2023లో భాగమయ్యాడు. ఈ టీ20 టోర్నీలో కేరళ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంజూ.. మ్యాచ్‌లు ఆడేందుకు ముంబైకి వెళ్లాడు.

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని, ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల సారథి, రాజస్తాన్‌ రాయల్స్ క్రికెటర్‌ జోస్‌ బట్లర్‌ను కలిశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సంజూతో పాటు రాజస్తాన్‌ రాయల్స్‌ ఫ్రాంఛైజీ కూడా అధికారిక సోషల్‌ మీడియా ఖాతాలో పోస్ట్‌ చేసింది.

ఈ ఫొటో ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తుంది అంటూ ఎక్స్‌ వేదికగా ఆర్‌ఆర్‌ కామెంట్‌ పెట్టింది. ఇందుకు స్పందించిన ఓ నెటిజన్‌.. ‘‘సంజూ ఈసారి సీఎస్‌కే ట్రేడింగ్‌ విండోలోకి వస్తాడు. రాసి పెట్టుకోండి.. ఇది తప్పక జరుగుతుంది’’ అని క్రేజీ కామెంట్‌ చేశాడు. వచ్చే ఏడాది ఐపీఎల్‌లో సంజూ సీఎస్‌కే రావడం ఖాయమంటూ జోస్యం చెప్పాడు.

ఈ ట్వీట్‌ నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఇందుకు స్పందించిన అభిమానులు.. ‘‘అదే జరిగితే చాలా బాగుంటుంది. ధోని వారసుడిగా సంజూ సీఎస్‌కే పగ్గాలు చేపడితే సూపర్‌గా ఉంటుంది’’ అని తమ ఆకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా సంజూ శాంసన్‌ ప్రస్తుతం రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. 

గతేడాది జట్టును ఫైనల్‌ చేర్చిన సంజూ ఈసారి ప్లే ఆఫ్స్‌నకు కూడా తీసుకువెళ్లలేకపోయాడు. ఏదేమైనా రాయల్స్‌ ఫ్రాంఛైజీ ఇప్పట్లో సంజూను వదులుకునే ఆలోచన చేయకపోవచ్చు. అయితే, ఫ్యాన్స్‌ మాత్రం సంజూ సీఎస్‌కేకు మారితే చూడాలని ఉందని కోరుకుంటున్నారు. ఇదండీ అసలు సంగతి!

కేరళ ఘన విజయం
సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ-2023లో భాగంగా బిహార్‌తో మ్యాచ్‌లో కేరళ విజయం సాధించింది. నవీ ముంబైలో గురువారం నాటి మ్యాచ్‌లో బిహార్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. కాగా ఇప్పటి వరకు తాజా ఎడిషన్‌లో సంజూ జట్టు ఆడిన మూడు మ్యాచ్‌లలో మూడింటిలో గెలుపొందింది. 

A post shared by Sanju V Samson (@imsanjusamson)

మరిన్ని వార్తలు