తమిళసినిమా: సూపర్స్టార్ హోదాపై ఇటీవల పెద్ద రచ్చే జరిగింది. దాదాపు 40 ఏళ్లుగా సూపర్స్టార్ అనే పట్టం రజనీకాంత్ని అంటిపెట్టుకుని వస్తోంది. అలాంటిది ఇటీవల తాజా సూపర్ స్టార్ విజయ్ అనే ప్రచారాన్ని ఒక వర్గం తెరపైకి తెచ్చింది. ఈ అంశంపై ఇటీవల టీవీ ఛానళ్లలో కూడా చర్చ జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ సూపర్స్టార్ అనే ఒక తమిళంలోనే కాకుండా తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ నటులకు అభిమానులు కట్టిన పట్టం. అలాంటి సూపర్స్టార్ పట్టం గురించి నటి పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళంలో పూ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమైన ఆ తరువాత ధనుష్ సరసన మరియాన్, కమలహాసన్తో ఉత్తమ విలన్, అదేవిధంగా శరత్కుమార్ నటించిన చైన్నెయిల్ ఆరు నాళ్, రానా, బాబి సింహా తదితరులు నటించిన బెంగళూరు నాట్కల్, శివరంజ, నియుమ్ ఇన్ముమ్ సిల పెంగుళుమ్ చిత్రాలలో నటించారు. ప్రస్తుతం పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న తంగలాన్ చిత్రంలో విక్రమ్తో కలిసి నటించారు. వీటితో పాటు దూత అనే వెబ్సిరీస్లోనూ నటించారు. ఇలా సెలెక్టడ్ చిత్రాల్లోనే నటిస్తున్న పార్వతి మలయాళంలో బిజీగా ఉన్నారు. ఈమె ఇటీవల ఒక భేటీలో సూపర్స్టార్ పట్టం గురించి మాట్లాడుతూ సూపర్స్టార్ అని చెప్పుకోవడంలో ఏం గౌరవం ఉంది అని ప్రశ్నించారు. అది జస్ట్ సమయానుకూలంగా చెప్పుకునేది మాత్రమేనని, దాని వల్ల ఎవరికీ ప్రయోజనం అని ప్రశ్నించారు. అసలు సూపర్స్టార్ అంటే ఏమిటో తనకు అర్థం కాలేదని, దాని వల్ల ఇమేజ్ వస్తుందా అన్నది కూడా తెలియటం లేదన్నారు. తనను సూపర్స్టార్ అనడం కంటే సూపర్ యాక్టర్ అని పిలవడమే సంతోషం అని పేర్కొన్నారు. తనకు తెలిసి మలయాళంలో ఫాహత్ ఫాజిల్, ఆసిఫ్ అలీ, నటి రామీ కళింగల్ సూపర్ యాక్టర్స్ అని నటి పార్వతి పేర్కొన్నారు.
నటి
పార్వతి