లాల్దర్వాజ ఆలయ పూజారికి కరోనా
అస్రా ఆసుపత్రిలో చేర్పించిన ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ
సాక్షి, చార్మినార్: లాల్దర్వాజ సింహవాహిని దేవాలయం పూజారి నర్సింహ పంతులు కరోనా వైరస్తో బాధపడుతున్నారు. నాలుగు రోజులుగా కరోనా పాజిటివ్తో బాధపడుతున్న ఆయన గురువారం వరకు హోం క్వారంటైన్లో వైద్య సేవలు పొందుతున్న ఆయనకు ఆక్సిజన్ లెవల్స్ తక్కువ కావడంతో గురువారం ప్రైవేట్ ఆసపత్రులను ఆశ్రయించారు. ఎక్కడా బెడ్లు ఖాళీగా లేవని చెప్పడంతో మొఘల్పురాలోని ఆస్రా ఆస్పత్రికి తరలించారు.
నర్సింహ పంతులును చేర్చుకోవడానికి వైద్యుల నిరాకరించడంతో ఆయన పెద్ద కుమారుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని ఫోన్లో సంప్రదించారు. వెంటనే స్పందించిన అసదుద్దీన్ ఒవైసీ అస్రా ఆస్పత్రి వైద్యులకు ఫోన్ చేసి చెప్పడంతో నర్సింహ పంతులను అడ్మిట్ చేసుకుని వైద్య సేవలందిస్తున్నారు. ఈ విషయం గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం విదితమే.