డీజీపీ అంజనీకుమార్‌ సస్పెండ్‌.. కొత్త డీజీపీగా రవిగుప్తా

3 Dec, 2023 17:49 IST|Sakshi

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్‌ను ఎలక్షన్‌ కమిషన్‌(ఈసీ) సస్పెండ్‌ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగానే అధికారికంగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డితో సంప్రదింపులు జరపడమే డీజీపీ అంజనీకుమార్‌ సస్పెన్షన్‌కు ప్రధాన కారణంగా తెలుస్తోంది.  ఇంకా తెలంగాణ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఎన్నికల ఫలితాలు రాకముందే రేవంత్‌రెడ్డితో భేటీ కావడమే డీజీపీపై సస్పెన్షన్‌ వేటు పడినట్లు తెలుస్తోంది. 

ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థిని పూల బొకేతో కలవడంతో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కిందకే రావడంతో డీజీపీ అంజనీకుమార్‌పై వేటుకు కారణమైంది. డీజీపీతో పాటు  అదనపు డీజీలు మహేష్‌ భగవత్‌,  సంజయ్‌ జైన్‌లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది ఈసీ. 

ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా డీజీపీ ఇలా కలవడమే హాట్‌ టాపిక్‌ అయ్యింది. ఎన్నికల కోడ్‌ ఐదో తేదీ వరకూ ఉన్న నేపథ్యంలో, గెలిచిన అభ్యర్థుల జాబితా ఇంకా పెండింగ్‌లోనే ఉండగానే ఇలా రేవంత్‌రెడ్డితో అధికార హోదాలో డీజీపీ అంజనీకుమార్‌ కలవడం వేటుకు ప్రధాన కారణమైంది. డీజీపీ అంజనీ కుమార్‌ను సస్పెండ్‌ చేసిన నేపథ్యంలో తదుపరి డీజీపీగా రవిగుప్తాను నియమించారు.

1990 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి రవిగుప్తా.. డిసెంబర్ 2022లో అవినీతి నిరోధక బ్యూరో (ACB) డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించారు. డైరెక్టర్ జనరల్ (విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్) అదనపు బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు

డీజీపీ అంజనీకుమార్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించిన కొద్ది గంటలకే రవిగుప్తాను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

మరిన్ని వార్తలు