తెలంగాణ ఎన్నికలకు సర్వం సిద్ధం

29 Nov, 2023 21:26 IST|Sakshi

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కోసం సర్వం సిద్ధమైంది. పోలింగ్ కేంద్రాలకు పోలింగ్‌ సిబ్బందిని, ఈవీఎంలను తరలించి  అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరగనుంది. అయితే అంతకంటే ముందే ఉ.5:30 గం.లకు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. 

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు. పోలింగ్‌ ముగిసే వరకు పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4:00 వరకే పోలింగ్ ముగిస్తారు. సమయం ముగిసేలోపు క్యూలో నిల్చున్నవాళ్లకు మాత్రం ఓటేసేందుకు మినహాయింపు ఉంటుందని ఎన్నికల అధికారులు తెలిపారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కోసం రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే.. 27,094 సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ నిర్వహిస్తున్నట్లు సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా  1.48 లక్షల మంది ఉద్యోగులు ఇప్పటికే ఓటు హక్కును ఇప్పటికే వినియోగించుకున్నారు. వృద్ధులు, దివ్యాంగులు.. దాదాపుగా 28వేల మంది ఓట్‌ ఫ్రమ్‌ హోం ద్వారా ఓటేశారు. 

తెలంగాణ ఎన్నికల కోసం 370 కేంద్ర బలగాలు, 45 వేల మంది పోలీస్‌ సిబ్బందిని నియమించారు. మొత్తంగా 2.08 లక్షల మంది సిబ్బందిని ఎన్నికల కోసం నియమించారు.

ఇదీ చదవండి: ఓటు విలువ: ‘కొంప’ ముంచిన ఒక్క ఓటు.. వీళ్ల ఓటమి ఎన్నికల చరిత్రకెక్కింది!

మరిన్ని వార్తలు