భూమి కబ్జా చేసిన నాయకుడు, ఆదుకోండంటూ సీఐ కాళ్ల మీద పడ్డ బాధితురాలు

13 Sep, 2023 13:59 IST|Sakshi

వెల్దుర్తి(తూప్రాన్‌): అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు తక్కువ ధరకు తమ భూమిని లాక్కోవాలని చూస్తున్నాడని, న్యాయం చేయాలని బాధితురాలు సీఐ కాళ్ల మీద పడి వేడుకుంది. ఈ ఘటన వెల్దుర్తి మండలం హస్తాల్‌పూర్‌ శివారులో మంగళవారం చోటు చేసుకుంది. శివ్వంపేట మండలం కొంతాన్‌పల్లికి చెందిన బొగ్గుల భిక్షపతి, జయలక్ష్మి దంపతులకు వెల్దుర్తి మండలం హస్తాల్‌పూర్‌ శివారులో 7.20 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 

ఈ భూమిలో సుమారు నాలుగెకరాల స్థలాన్ని శివ్వంపేట పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకట్రాంరెడ్డి అక్రమంగా కబ్జాచేశాడని, రక్షణ క్పలించాలని బాధితురాలు సోమవారం ఎస్పీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఈ మేరకు తూప్రాన్‌ సీఐ శ్రీధర్‌ మంగళవారం హస్తాల్‌పూర్‌ శివారులో విచారణ చేపట్టారు. తమ వ్యవసాయ బోరుబావిని సైతం స్వాధీనం చేసుకున్నాడని, అడిగితే బెదిరిస్తున్నాడని బాధితురాలు వాపోయింది.

అదే గ్రామానికి చెందిన మరో రైతు కూడా నక్ష బాటను కబ్జా చేశాడని, పొలాల్లోకి వెళ్ళకుండా అడ్డుకుంటున్నారని వివరించారు. వారసత్వంగా వచ్చిన భూమిని ఆక్రమించిన వ్యక్తిపై చట్టపర చర్యలు తీసుకొని న్యాయం చేయాలంటూ.. సీఐ శ్రీధర్‌ కాళ్ళమీదపడి బాధితురాలు ప్రాధేయపడింది. 

మరిన్ని వార్తలు