పుల్లారెడ్డి మనవడి ఇంట అడ్డుగోడ తొలగింపు

19 Jul, 2022 15:19 IST|Sakshi
అడ్డుగా ఉన్న గోడను తొలగిస్తున్న దృశ్యం

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ వ్యాపారవేత్త జి. పుల్లారెడ్డి మనవడు ఏకనాథ్‌రెడ్డి భార్య ప్రజ్ఞారెడ్డి ఇంట్లోకి రాకుండా కట్టిన అడ్డుగోడను తొలగించాలని న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సోమవారం ప్రొటెక్షన్‌ అధికారులు అమలు చేశారు. ఉదయం ఇంటికి చేరుకున్న ప్రొటెక్షన్‌ అధికారి అక్కేశ్వర్‌రావు పంజగుట్ట పోలీసుల సహకారం తీసుకుని అడ్డుగా ఉన్న గోడను తీయించారు. 

మొదట ఉదయం 9 గంటల ప్రాంతంలో ప్రొటెక్షన్‌ అధికారిని అనితారెడ్డి అక్కడకురాగా ఏకనాథ్‌రెడ్డి తరఫు న్యాయవాది గోడకూల్చే విషయంలో పునరాలోచించుకోవాలని గతంలో వీరికి అనుకూలంగా ఇచ్చిన కోర్టు ఆదేశాలు చూపగా పరిశీలించిన అధికారులు జిల్లా ప్రొటెక్షన్‌ అధికారి అక్కేశ్వర్‌రావుకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న అక్కేశ్వర్‌రావు అడ్డుగా నిర్మించిన గోడను తొలగించారు. న్యాయస్థానం ప్రజ్ఞారెడ్డి ఫిర్యాదు మేరకు ఇంట్లో స్వేచ్ఛగా తిరిగేందుకు అడ్డుగా ఉన్న గోడను తొలగించాలని ఆదేశించిందని, దాన్ని తాము అమలు చేసినట్లు ఆయన తెలిపారు. 

న్యాయస్థానం ఆదేశాలు ఎంతో సంతోషాన్నిచ్చాయి 
న్యాయస్థానం ఆదేశాలు ఎంతో సంతోషాన్నిచ్చాయని ఏకనాథ్‌రెడ్డి భార్య ప్రజ్ఞారెడ్డి అన్నారు. ఏకనాథ్‌రెడ్డి కుటుంబంతో తాను న్యాయపోరాటం చేస్తుండగా ఈ నెల 15వ తేదీన అడ్డుగా ఉన్న గోడను తొలగించాలని ఆదేశాలు ఇచ్చిందన్నారు. గోడను తొలగించిన ప్రొటెక్షన్‌ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. రెండు నెలలుగా తాను తన పాప కిందకు, పైకి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. (క్లిక్‌: నిత్య పెళ్లి కొడుకును అరెస్ట్‌ చేయాలి)

మరిన్ని వార్తలు