ర్యాపిడ్‌, ఆర్టీపీసీఆర్‌ టెస్టుల్లో తేడా ఏంటి ?

26 Apr, 2021 08:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ట్రూనాట్, ర్యాపిడ్‌ యాంటీ జెన్‌ టెస్టులను పాయింట్‌ ఆఫ్‌ కేర్‌ అంటారు. అంటే  వీటిని ఎక్కడికైనా తీసుకెళ్లి చేసుకోవచ్చు. అదే ఆర్టీపీసీఆర్‌కు పెద్ద ల్యాబొరేటరీ ఎక్విప్‌మెంట్‌ ఉండాలి. ట్రూనాట్‌ అనేది ఒక చిప్‌ బేస్డ్‌ టెస్టింగ్‌. మన శరీరంలో ఎక్కువ జీన్‌లు ఉంటాయి.

అయితే ఇది కొన్ని జీన్‌లను మాత్రమే కనుక్కుంటుంది. వీటిలో వైరస్‌ ఉందో లేదో మాత్రమే గుర్తిస్తుంది. తక్కువ సమయంలో రిజల్ట్‌ వస్తుంది. అదే ఆర్టీపీసీఆర్‌లో ఎక్కువ జీన్‌లను గుర్తించే అవకాశం ఉంటుంది. కేసులు ఎక్కువవుతున్నాయి కాబట్టి, తక్కువ సమయంలో రిజల్ట్‌ వస్తుంది కాబట్టి, అలాగే ఎక్కడైనా టెస్టు చేసేందుకు అవకాశం ఉందన్న ఉద్దేశంతో ట్రూనాట్, ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులకు అనుమతి ఇచ్చారు. గొంతులో ద్రవం తీసి కిట్‌పై వేస్తే 10 నిమిషాల్లో రిజల్ట్‌ వస్తుంది. ఇందులో పాజిటివ్‌ వస్తే తిరిగి ఆర్టీపీసీఆర్‌కు వెళ్లి నిర్ధారించుకోవచ్చు. ఆర్టీపీసీఆర్‌నే గోల్డెన్‌ స్టాండర్డ్‌ టెస్టుగా చెప్పుకోవాలి. 

-డాక్టర్‌ ఆవుల రేణుకాదేవి, ప్రొఫెసర్, మైక్రోబయాలజీ, కర్నూలు ప్రభుత్వ మెడికల్‌ కాలేజి 



కరోనా నిర్ధారణ అయిన వెంటనే డీడైమర్, హెచ్‌ఆర్‌సీ టెస్టులు చేసుకోవచ్చా?
కరోనా పాజిటివ్‌ వచ్చిన తర్వాత 5–7 రోజుల మధ్య డీడైమర్, హెచ్‌ఆర్‌సీటీ థొరాక్స్‌ వంటి టెస్టులు చేయించుకోమని సలహా ఇస్తాం.   వైరస్‌ ప్రభావంతో రక్తం గడ్డ కట్టే అవకాశం ఉంది. డీడైమర్‌ లెవల్స్‌ పెరుగుతుంటే దాని ప్రభావం రక్తం మీద పడుతోందని అర్థం. అప్పుడు రక్తం గడ్డ కట్టకుండా వైద్యుల సూచనల మేరకు బ్లడ్‌ థిన్నర్స్‌ వాడాలి. ఇక కోవిడ్‌ వల్ల ఊపిరితిత్తులు ఇన్‌ఫెక్షన్‌కు గురవుతున్న విషయం తెలిసిందే. నిమోనియా శాతం తెలుసుకోవడానికే హెచ్‌ఆర్‌సీటీ థొరాక్స్‌ టెస్టు. దీనిద్వారా ఊపిరితిత్తులపై వైరస్‌ ప్రభావం పడిందా లేదా అని తెలుసుకోవచ్చు.-డాక్టర్‌ శ్రీనివాస్, మెడికల్‌ ఆఫీసర్, యూపీహెచ్‌సీ, బాలాపూర్‌

( చదవండి: డోసుల మధ్య ఎంత విరామం అవసరం?  తేడా వస్తే ?  )

మరిన్ని వార్తలు