యుద్ధం ముగియాలి.. హైదరాబాద్ వరుడికి ఉక్రెయిన్‌ వధువుతో వివాహం

1 Mar, 2022 21:47 IST|Sakshi
ఉక్రెయిన్‌ వధువు, హైదరాబాద్‌ వరుడిని  ఆశీర్వదిస్తున్న అర్చకుడు రంగరాజన్‌

చిలుకూరు అర్చకుడు రంగరాజన్‌ ఉక్రెయిన్‌ వధువు, హైదరాబాద్‌ వరుడికి ఆశీర్వాదం

మొయినాబాద్‌: ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్దం త్వరలో ముగిసిపోయి వెంటనే శాంతిస్థాపన జరగాలని కోరుతూ చిలుకూరు బాలాజీ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసినట్లు అర్చకుడు రంగరాజన్‌ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి నగరంలో జరిగిన ఉక్రెయిన్‌ వధువు లియుబోవ్, హైదరాబాద్‌ వరుడు ప్రతీక్‌ రిసెప్షన్‌లో ఆయన పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. స్వామివారి శేషమాల, శేషవస్త్రాలను వారికి అందజేసి ఆయురారోగ్యం, సత్‌ సంతానంతో కలిసిమెలిసి ఉండాలని దీవించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉక్రెయిన్, రష్యా యుద్ధం త్వరగా ముగియాలని చిలుకూరు వెంకటేశ్వర స్వామివారిని ప్రార్థిస్తున్నామని చెప్పారు. ఈ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా రక్తపాతం, అల్లకల్లోలం నెలకొందన్నారు. కోవిడ్‌తో ప్రపంచం ఇంకా పూర్తిగా కోలుకోలేదని, ఈతరుణంలో యుద్ధంతో బీతావహ పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.


 

మరిన్ని వార్తలు