Atlee: అట్లీ భారీ స్కెచ్‌.. ఆ ఇద్దరితో హాలీవుడ్‌ మూవీ!

14 Nov, 2023 12:14 IST|Sakshi

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రం జవాన్‌. ఈ ఏడాది విడుదలైన ఈ చిత్రంలో నయనతార, విజయ్‌ సేతుపతి, ప్రియమణి వంటి సౌత్ సూపర్‌స్టార్స్  ఎక్కువగా నటించారు. దర్శకుడు కూడా తమిళనాడుకు చెందిన అట్లీ కావడం విశేషం. కాగా ఈ చిత్రం రూ.1100 కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్‌ హిట్‌గా నిలిచింది.

(ఇది చదవండి: ఐదు భిన్నమైన గెటప్స్‌లో కనిపించనున్న కంగువ)

ఇక కోలీవుడ్‌లో దళపతిగా అభిమానులు పట్టం కట్టిన నటుడు విజయ్‌ ఆ మధ్య నటించిన చిత్రం బిగిల్‌. అందులోనూ నయనతారనే హీరోయిన్ కావడం మరో విశేషం. ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహించగా.. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఇక జవాన్, బిగిల్‌ చిత్రాల్లో మరో కామన్‌ విషయం హీరోలు ద్విపాత్రాభినయం చేయడం. ఇప్పటివరకు అపజయం ఎరుగని దర్శకుడిగా  అట్లీ నిలిచారు. కాగా ఆయన తదుపరి చిత్రం ఏంటనే విషయంపై ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. 

దీనిపై తాజాగా ఒక ఆసక్తికరమైన వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. జవాన్‌ హీరో షారుక్‌ ఖాన్, బిగిల్‌ హీరో విజయ్‌తో ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారన్నదే లేటెస్ట్ టాక్. జవాన్‌ చిత్రంలో షారుక్‌ఖాన్‌తో కలిసి విజయ్‌ అతిథి పాత్రలో మెరవనున్నారనే ప్రచారం జరిగింది. కానీ అది వాస్తవం కాదని తెలిసిపోయింది.

అయితే విజయ్‌తో కలిసి నటించడానికి  తాను సిద్ధమని షారుక్‌ ఖాన్‌ జవాన్‌ చిత్రం సమయంలోనే వెల్లడించారు. అదేవిధంగా షారుక్‌ ఖాన్‌తో కలిసి నటించిన డానికి తాను సిద్ధమేనని విజయ్‌ కూడా అన్నారు. కాగా ఇటీవల ఒక ప్రముఖ హాలీవుడ్‌ చిత్ర నిర్మాణ సంస్థ తన దర్శకత్వంలో చిత్రం చేయడానికి ముందుకు వచ్చినట్లు అట్లీనే స్వ యంగా ఇటీవల ఓ భేటీలో పేర్కొన్నారు. ఈ చిత్రానికి కథను సిద్ధం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. దీంతో ఇది షారుక్‌ ఖాన్‌, విజయ్‌ కలిసి నటించిన చిత్రం అవుతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ రావాలంటే కొద్ది కాలం ఆగాల్సిందే. అదేవిధంగా ఇది బాలీవుడ్‌ చిత్రం అవుతుందా? లేక హాలీవుడ్‌ చిత్రం అవుతుందా అన్నది కూడా తెలియాల్సి ఉంది.

(ఇది చదవండి: పిల్లలు కావాలని హీరోను పెళ్లి చేసుకున్నా: స్టార్‌ హీరోయిన్‌)

మరిన్ని వార్తలు