ప్రమాదాల్లో 11,822 మంది మృత్యువాత 

29 Oct, 2021 02:49 IST|Sakshi

11 శాతం తగ్గిన రోడ్డు ప్రమాదాలు 

నివేదిక విడుదల చేసిన ఎన్‌సీఆర్‌బీ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రోడ్డు, రైలు, ఇతర ప్రమాదాల వల్ల 11,822 మంది మృత్యువాత పడ్డట్లు నేషనల్‌ క్రైమ రికార్డ్స్‌ బ్యూరో వెల్లడించింది. ప్రమాద మరణాలు, ఆత్మహత్యలకు సంబంధించిన జాబితాను గురువారం విడుదల చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 2019 కంటే 2020 ఏడాదిలో రోడ్డు ప్రమాదాల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య తగ్గినట్లు పేర్కొంది. అలాగే ఆత్మహత్య ఘటనల్లోనూ తగ్గుదల ఉందని వెల్లడించింది. 

ప్రమాదాల్లో 11,822 మంది..  
రోడ్డు ప్రమాదాలు, రైల్వే ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు ఇతరత్రా ప్రమాదాల కింద మొత్తం 11,822 మంది మరణించినట్లు వెల్లడించింది. 2019–20కి సంబంధించిన జాబితాలో రాష్ట్రంలో జరిగిన 19,505 ఘటనల్లో 7,219 మంది రోడ్డు ప్రమాదాల్లోనూ మృత్యువాత పడ్డుట్టు తెలిపింది. ప్రకృతి వైపరీత్యాల కారణం గా 170 మంది మృత్యువాత పడినట్లు తెలిసింది.

రైలు ప్రమాదాల్లో 337 మంది మృత్యువాత పడ్డారని పేర్కొంది. గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదాలతో పోలిస్తే 11 శాతం మృతుల సంఖ్య తగ్గినట్టు ఎన్‌సీఆర్‌బీ స్పష్టం చేసింది. పలు కారణాల వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటనల్లో 8,058 మంది మృతి చెందినట్లు నేషనల్‌ క్రైమ్‌ రికార్డు బ్యూరో వెల్లడించింది. ఇందులో కుటుంబ సమస్యల వల్ల ఆత్మహత్యలకు పాల్పడ్డ వారే అధికంగా ఉన్నారని తెలిపింది.

>
మరిన్ని వార్తలు