హైదరాబాద్‌ కొత్త సీపీగా శ్రీనివాస్‌రెడ్డి: డ్రగ్స్‌పై వారికి వార్నింగ్‌

13 Dec, 2023 11:43 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్‌: డ్రగ్స్ ముఠాలు హైదరాబాద్ వదిలిపోవాల్ని, లేదంటే కఠిన చర్యలుంటాయని హైదరాబాద్‌ కొత్త పోలీస్‌ కమిషనర్‌(సీపీ) కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారం(డిసెంబర్‌13) బంజారాహిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో నూతన సీపీగా శ్రీనివాస్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.ఇప్పటిదాకా సీపీగా ఉన్న సందీప్‌ సాండిల్య శ్రీనివాస్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సీపీ కీలక వ్యాఖ్యలు చేశారు.   
 
‘డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో కుడా డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంది. సినిమా పెద్దలు మీటింగ్ పెట్టుకోవాలి. డిమాండ్ ఉన్నందునే  సప్లై జరుగుతోంది. పార్టీల పేరుతో డ్రగ్స్ వాడొద్దు. కొన్ని పబ్‌లలో డ్రగ్స్‌ వాడకం జరుగుతోంది. అది వెంటనే ఆపేయాలి. తెలంగాణ స్టేట్‌తో పాటు హైదరాబాద్‌ సిటీని డ్రగ్స్‌ ఫ్రీ సిటీగా చేయాలని ప్రభుత్వ ఆదేశాలున్నాయి. ఫ్రెండ్లీ పోలీస్ అనేది సరిగా అర్ధం చేసుకోవాలి.చట్టాన్ని అతిక్రమించే వారికీ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండదు’అని సీపీ స్పష్టం చేశారు.

‘నా శక్తి సామర్థ్యాలు గుర్తించి హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు. ఇప్పుడు హైదరాబాద్‌లో ముఖ్యంగా డ్రగ్స్, జూదాన్ని నిర్ములిస్తాం. ప్రజలకు , ప్రభుత్వానికి వారధిగా మీడియా ఉంటుంది. ప్రజాభిప్రాయాన్ని  మీడియా ద్వారా తెలియజేయాలని కోరుతున్నా. మహిళ వేధింపులు, ర్యాగింగ్‌లపై షీ టీమ్స్ పని తీరును మరింత మెరుగుపరుస్తాం’ సీపీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గతంలో గ్రేహౌండ్స్‌లో పనిచేసిన శ్రీనివాస్‌రెడ్డికి ముక్కుసూటి అధికారిగా పేరుంది.

ఇదీచదవండి..కొత్త సర్కార్‌ ప్లాన్‌!.. సెంట్రల్‌లోకి స్వితా సబర్వాల్‌.. ఆమ్రపాలి ఇన్‌!

>
మరిన్ని వార్తలు