ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరి అరెస్ట్‌

28 Mar, 2024 16:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మాజీ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావు, ఎన్‌స్పెక్టర్‌ గట్టు మల్లును అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరిని గురువారం హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సిట్‌ అధికారులు విచారిస్తున్నారు. ప్రభాకర్‌ రావు, ప్రణీత్ రావుతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు.

కాగా ప్రణీత్‌రావుపై కేసు నమోదుకాగానే రాధాకిషన్‌రావు అమెరికా వెళ్లిపోయారు. లుకౌట్‌ నోటీసులు జారీ చేయడంతో హైదరాబాద్‌కు తిరిగివచ్చారు. ప్రణీత్‌ రావు డ్రైవర్‌ను కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రభాకర్‌రావుతో సమానంగా రాధాకిషన్‌ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేయడంతో రాధాకిషన్‌ గట్టుమల్లు కీలకపాత్ర వహించినట్లు తెలుస్తోంది. 

ఈ కేసులో ఇప్పటికే ప్రణీత్‌రావుతో పాటు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రముఖుల వ్యక్తిగత విషయాలపై వీరు నిఘా పెట్టి, ప్రభుత్వం మారాక హార్డ్‌డిస్క్‌లను ధ్వంసం చేసినట్లు ఆరోపణలున్నాయి. మరో వైపు  భుజంగరావు, తిరుపతన్నను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో బుధవారం వాదనలు ముగియగా.. న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌ చేసింది.
చదవండి: ఎస్‌ఐబీలో నడిచిన ఓఎస్డీల రాజ్యం..

Election 2024

మరిన్ని వార్తలు