ఆర్‌ఎంపీ తెలిసీ తెలియని వైద్యానికి యువకుడు బలి

2 Apr, 2021 07:47 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నిబంధనలకు నీళ్లొదిలిన ఆర్‌ఎంపీ, ఓ ప్రైవేటు ఆస్పత్రి 

కరోనాను దాచిపెట్టి వైద్యం చేసిన వైనం 

కలెక్టర్, డీఎంహెచ్‌ఓకు గ్రామస్తుల ఫిర్యాదు

కమలాపూర్‌: అనుమతి లేకుండా ఓ ఆర్‌ఎంపీ చేసిన వైద్యానికి యువకుడు బలయ్యాడు. కరోనా పాజిటివ్‌ అని తెలిసి కూడా నిబంధనలకు విరుద్ధంగా చేసిన వైద్యం ఆ యువకుడి ప్రాణాలను బలి తీసుకుంది. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ మండలంలోని భీంపల్లికి చెందిన ఓ యువకుడు (20) సుమారు 10 రోజులు జ్వరం, ఇతర సమస్యలతో బాధపడుతూ గ్రామంలోని ఆర్‌ఎంపీ వద్ద వైద్యం చేయించుకున్నా నయం కాలేదు.

దీంతో ఆ ఆర్‌ఎంపీ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి యువకుడిని తరలించగా అక్కడ కరోనా పాజిటివ్‌ అని తేలడంతో రెండు రోజుల పాటు చికిత్స చేశారు. ఆ తర్వాత యువకుడు మళ్లీ గ్రామానికి రాగా, కరోనా విషయాన్ని దాచిన ఆర్‌ఎంపీ మరో మూడు రోజులు వైద్యం చేశాడు. ఇంతలోనే యువకుడి పరిస్థితి విషమించడంతో జిల్లా కేంద్రంలోని మరో ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకువెళితే హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు.

ఆ తర్వాత యువకుడిని హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో చేరి్పంచగా అక్కడ చికిత్స పొందుతూ గత నెల 27న ఆ యువకుడు మృతి చెందాడు. కరోనా పాజిటివ్‌ అని తేలాక కూడా ఎవరికీ చెప్పకుండా వైద్యం చేసిన ఆర్‌ఎంపీ వైద్యుడు, వరంగల్‌లో వైద్యం అందించిన ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు గత నెల 31న జిల్లా కలెక్టర్‌తో పాటు డీఎంహెచ్‌ఓకు ఫిర్యాదు చేశారు. దీంతో వైద్య, ఆరోగ్య శాఖ జిల్లా అధికారులు విచారణ ప్రారంభించారు. 
(చదవండి: పిందెలు తెంపారని.. పేడ తినిపించారు! )

మరిన్ని వార్తలు