34 వేల ఎకరాల్లో పంట నష్టం

18 Jan, 2022 03:48 IST|Sakshi

20 వేల ఎకరాల్లో మిర్చి, 10 వేల ఎకరాల్లో మొక్కజొన్న 

4 వేల ఎకరాల్లో ఇతర పంటలు దెబ్బతిన్న వైనం 

వర్షాలపై వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా 

ఇన్‌పుట్‌ సబ్సిడీ/ సబ్సిడీ విత్తనాలపై త్వరలో సర్కారునిర్ణయం! 

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల కురిసిన అకాల వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 34 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఇందులో మొక్కజొన్నతో పా టు వేరుశనగ, పెసలు, జొన్న, మినుములు, మిర్చి, వరి, కంది పంటలు దెబ్బతిన్నట్లు పేర్కొంది. వరంగల్, హనుమకొండ, మహ బూబాబాద్‌ జిల్లాల పరిధిలో ఎక్కువగా పంట నష్టం జరిగిందని నివేదించింది.

అత్యధికంగా మిర్చి పంట 20 వేల ఎకరాల్లో దెబ్బతిన్నది. మరో 10 వేల ఎకరాల్లో మొక్కజొన్న, ఇంకో 4 వేల ఎకరాలు ఇతర పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వడమా లేక సబ్సిడీపై విత్తనాలు అందజేయడమా అనే విషయంపై సర్కారు త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా, సూర్యాపేట జిల్లాలో జరిగిన పంట నష్టంపై అంచనాలు వేస్తున్నామని తెలిపారు.  

3 రోజుల్లో .. 300 గ్రామాల్లో 
వరంగల్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వారం పాటు వడగళ్లు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. మొదటి మూడు రోజుల్లోనే 20 మండలాల్లోని 300 గ్రామాల్లో కోట్ల రూపాయల విలువైన పంటలకు నష్టం జరిగిందని అంచనా. ఒక్క వరంగల్, హనుమకొండ జిల్లాల్లోనే ఎక్కువ పంట నష్టం జరిగిందని అధికారులు పేర్కొంటున్నారు.  

బీమా లేక నష్టపోయిన రైతాంగం 
రెండేళ్లుగా రాష్ట్రంలో పంటల బీమా అమలు కావడం లేదు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్‌ బీమా, వాతావరణ బీమా పథకాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం వైదొలగింది. దీంతో అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్నప్పటికీ రైతులకు పరిహారం అందని పరిస్థితి ఏర్పడింది. 

నష్ట పరిహారం చెల్లించాలి
వారం రోజులు కురిసిన వడగండ్ల వర్షం వలన పొలాల్లో పంటలు దెబ్బతినడమే కాక, మార్కెట్‌కు వచ్చిన ధాన్యం, మిర్చి తడిచిపోయింది. కొంత ధాన్యం వరద లో కొట్టుకుపోయింది. దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించాలని కోరుతున్నాం.

గత సంవత్సరం 12.60 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతినగా, ఈ సం వత్సరం 8.5 లక్షల ఎకరాల్లో వరదల వల్ల పంటలు దెబ్బతిన్నాయి. దీనికి తో డు ఈ నెలలో వచ్చిన అధిక వర్షాలు, రా ళ్ళ వర్షాల వల్ల రైతుల పంటలకు నష్టం వాటిల్లింది. అయినా ఇంతవరకు ప్రభు త్వం ఎలాంటి పరిహారం ఇవ్వలేదు. వెంటనే నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించాలి. 
– సాగర్, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రైతు సంఘం  

మరిన్ని వార్తలు