ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణకు హాజరు

9 Feb, 2021 19:54 IST|Sakshi

విచారణకు హాజరైన ఎమ్మెల్యేలు సీతక్క, మహిపాల్‌రెడ్డి, చిన్నయ్య

సీతక్కపై నాన్‌ బెయిల్‌ ఉపసంహరణ

గైర్హాజరైన ఎస్‌హెచ్‌ఓపై ఆగ్రహం

హైదరాబాద్‌: అధికార, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు మంగళవారం హైదరాబాద్‌ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు వరుస కట్టారు. టీఆర్‌ఎస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే హాజరయ్యారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై కోర్టు విచారణకు వచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క (ములుగు)పై జారీ చేసిన నాన్‌ బెయిల్‌ వారెంట్‌ను కోర్టు ఉప సంహరించుకోగా.. అయితే రూ.10 వేల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. 

తొలుత ఎన్నికల నియమావళి కేసుపై విచారణ జరిగింది. ఈ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క విచారణకు హాజరయ్యారు. వేర్వేరు కేసులో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి (పటాన్‌చెరు), దుర్గం చిన్నయ్య (బెల్లంపల్లి) కూడా కోర్టుకు హాజరయ్యారు. కోర్టు ముందు విచారణ కోసం వచ్చారు. అయితే మరో కేసులో విచారణకు కావాలని మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లకు న్యాయస్థానం సమన్లు జారీ చేసింది.

ఇంకొక కేసులో సమన్లు జారీ చేసిన కూడా గైర్హాజరవడంతో నిజామాబాద్ రూరల్ పీఎస్ ఎస్‌హెచ్ఓపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌పై ఎన్‌బీడబ్ల్యూ అమలు చేయకపోవడంపై అతడిని కోర్టు పిలిచింది. అయితే ఎస్‌హెచ్ఓ కోర్టుకు హాజరు కాలేదు. దీంతో ఆగ్రహించిన ధర్మాసనం నిందితుడిగా ఉన్న బాజిరెడ్డి గోవర్ధన్‌కు సహకరించేలా అతడు వ్యవహరిస్తున్నారని డీజీపీకి సమాచారం అందించింది. నిజామాబాద్ రూరల్ ఎస్‌హెచ్ఓపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డీజీపీకి సూచించింది. 

>
మరిన్ని వార్తలు