జిల్లా ఎన్నికల అధికారి పి.రంజిత్బాషా
బాపట్ల: జాతి, కుల, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ నిష్పక్షపాతంగా ఓటు వేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.రంజిత్ బాషా సూచించారు. స్వీప్ (ఓటు హక్కు అవగాహన) కార్యక్రమాన్ని సోమవారం బాపట్ల మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు. ఓటు హక్కు విలువను చాటి చెప్పేలా, ఈవీఎం యంత్రం నమూనాతో ప్రత్యేకంగా రూపొందించిన బెలూన్ను గాలిలోకి కలెక్టర్ ఎగురవేశారు. అనంతరం తొలి సంతకం చేసి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓటు హక్కును నిర్భయంగా సద్వినియోగం చేసుకుంటానని ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మాట్లాడుడూ ఓటు మన భవిష్యత్తును మార్చేస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు చాలా విలువ ఉందని చెప్పారు. సామాజిక అభివృద్ధి వైపు నడవాలంటే ప్రతి ఒక్కరు మీ ఓటుహక్కును వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు ఓటు వేయడానికి స్వేచ్ఛాయుత వాతావరణ కల్పిస్తున్నామని చెప్పారు. రాజ్యాంగంపై విశ్వాసంతో దేశ సంప్రదాయాలను గౌరవించాలని తెలిపారు. ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఎలాంటి ప్రలోభాలకు గురికావద్దని సూచించారు. ప్రతి ఒక్కరు పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసేలా చైతన్యం రావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్. సత్తిబాబు, స్వీప్ జిల్లా నోడల్ అధికారి వై. పిచ్చిరెడ్డి, ఐటీ నోడల్ ఆఫీసర్ విష్ణు, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, తహసీల్దార్ శ్రావణ్ కుమార్, పాల్గొన్నారు.