కూటమిలో అంతా చంద్రబాబు మనుషులే: సజ్జల | Sakshi
Sakshi News home page

కూటమిలో అంతా చంద్రబాబు మనుషులే: సజ్జల

Published Thu, Apr 25 2024 5:27 PM

Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu And Pawan - Sakshi

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు కోసమే పవన్‌ తాప్రతయం అంటూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమిలో అంతా చంద్రబాబు మనుషులేనన్నారు. తాడేపల్లిలో తనను కలిసిన మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.

‘‘చిరంజీవిని ఉద్దేశించి నేను ఏమి అనలేదు. మీడియావాళ్లు చిరంజీవి కూటమికి మద్దతు ఇచ్చారు.. దీనిపై నా అభిప్రాయం అడిగితే దానిపై స్పందిస్తూ  చిరంజీవి కూటమికి మద్దతు ఇవ్వడం మంచిదే కానీ.. కూటమితో చిరంజీవే కాదు ఇంకా ఎవ్వరూ కలిసి వచ్చినా ఇబ్బంది లేదని చెప్పా. చిరంజీవిని నేను విమర్శించాను అని చెప్పడం ద్వారా కొంత మందినైనా దగ్గర చేసుకోవచ్చని మూడు పార్టీల నేతలు భావిస్తున్నారు. నేను చిరంజీవిని కామెంట్ చేశానని ఇంతగా ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారని ఆలోచిస్తే.. చంద్రబాబు,పవన్ కల్యాణ్ ల శక్తి సరిపోదని భావించి చిరంజీవి అభిమానులు,ఆ సామాజిక వర్గం వారి ఓట్లను గంపగుత్తగా తీసుకువెళ్లి చంద్రబాబుకు ఎలా వేయించాలా అనే తపన, ఆత్రం అందులో కనిపిస్తున్నాయి.

2014లో బీజేపీ, జనసేన, టీడీపీకి మధ్దతు ఇచ్చాయి. అప్పుడు ప్రజలను రాచి రంపాన పెట్టారు. మళ్ళీ ఇప్పుడు పొత్తు పెట్టుకొని వస్తున్నారు” అని  మండిపడ్డారు. బాండెడ్ లేబర్ కంటే అన్యాయంగా బీజేపీ, జనసేన టీడీపీ ముందు సాగిలపడ్డాయి. ఆత్మాభిమానం వదిలేసి రెండు పార్టీలు టీడీపీతో జత కట్టాయి. వాళ్ళు ఓడిపోతున్నాం అని తెలిసి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. డ్వాక్రా మహిళల గురించి చంద్ర బాబు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నవ్వొస్తుంది. హాస్యస్పదంగా కనిపిస్తోంది. డ్వాక్రా మహిళలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. 2014లో డ్వాక్రా మహిళలకు రుణ మాఫీలు చేస్తానని చంద్రబాబు మోసం చేశారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబులకు సంస్కారం లేదు. చంద్రబాబుకు కుటుంబ విలువలు తెలుసా? చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు ఎక్కడ ఉన్నాడు.?. చంద్రబాబు చెల్లెళ్ళు ఎక్కడ ఉన్నారు?” ఈ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పగలరా అని సజ్జల ప్రశ్నించారు.

ఎదుటివారిపై నిందలు వేయడం చంద్రబాబుకు అలవాటుగా మారింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు. 2014లో చంద్రబాబు అలవికాని హామీలిచ్చి మోసం చేశారు. మేనిఫెస్టోను సైతం టీడీపీ వెబ్‌సైట్ నుంచి తొలగించారు. పవన్ కల్యాణ్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు రోజు రోజుకు ప్రస్టేషన్ పెరుగుపోతోంది. వైఎస్సార్‌సీపీ విజయం సాధించబోతోందని వారికి పూర్తిగా అర్థమైంది. విమర్శలు ఎన్నాయినా చేయొచ్చు.. వాటికి ఆధారాలుండాలి. రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసింది ఎవరు?. చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. అప్పుడు ప్రజలను ఎలా మోసం చేసిందో అందరికి తెలుసు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాబోతుందనే చంద్రబాబు,పవన్ కల్యాణ్‌ల ఆందోళనగా కనిపిస్తోంది.

చంద్రబాబుకు ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటీసు స్పందించకపోగా బెదిరింపులకు దిగుతున్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా జరిగిన సభలలో మాట్లాడిన మాటలు చదివి వినిపించాలని అనుకున్నాకూడా సిగ్గేస్తుంది. ప్రభుత్వ విధానాలపై మాట్లాడకుండా నోటికి వచ్చిన తిట్లు తిడుతున్నారు. ఓటమి భయంతో నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోను త్వరలోనే  విడుదల చేస్తాం అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మేము చంద్రబాబు కుటుంబాల గురించి మాట్లాడితే చంద్ర బాబు తలెత్తుకొని తిరగలేరు. ఎన్నికలు అంటే ఇచ్చిన హామీలు చేసిన పనుల గురించి మాట్లాడాలి. ఎన్నికలంటే ప్రజలకు సేవ ఎలా చేయాలి. వారితో ఎలా మమేకం అవ్వాలి.. రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృధ్ది పధంలోకి తీసుకువెళ్లాలి. పేదల కోసం సంక్షేమం ఎలా అందించాలి అనే అంశాలపై దృష్టి సారించాలి. కుటుంబాల గురించి కాదనే అంశాన్ని చంద్రబాబు గుర్తిస్తే మంచిదన్నారు.

ఎన్నికల కమిషన్ స్వతంత్ర సంస్థ వాళ్ల పని వాళ్లు చేస్తారు. కక్ష సాధింపు చర్యలకు ఎన్నికల కమిషన్ పాల్పడుతుందని మేము భావించడం లేదని అధికారుల బదిలీలను ఉద్దేశించి మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అధికారుల బదిలీల గురించి మేము ఏమి మాట్లాడం. ఎన్నికల నోటిఫికేషన్, కోడ్ అమలులోకి వచ్చినప్పటినుంచి జగన్ గారు ప్రజల మధ్యనే ఆయన గత ఐదేళ్లుగా చేసిన అభివృద్దిని వివరిస్తూ ఓట్లడుగుతున్నారు. మద్దతు ఇమ్మని అడుగుతున్నారు. వ్యవస్థలను అడ్డం పెట్టుకునీ ఎన్నికల్లో గెలుపొందాలని టీడీపీ చూస్తోంది.

2019 ఎన్నికల ముందు ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వెళ్లి మరీ  బెదిరించిన వ్యక్తి చంద్రబాబు. టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు ఫిర్యాదులు పదే పదే చేసి అధికారుల్ని బెదిరిస్తున్నారు. కొన్ని అభూత కల్పనలను క్రియేట్ చేసి వ్యవస్థలను, ఎన్నికల కమిషన్‌ను బెదిరించాలని చూస్తున్నారు. పెన్షన్లు పంపిణీ జరగకుండా అడ్డుకుంది తెలుగుదేశం పార్టీనే అని రాష్ట్రంలోని ప్రజలందరికి  తెలుసు. మళ్లీ ఇప్పుడు ఆలస్యం అవ్వకుండా ఫస్ట్ తేదీనాడు పెన్షన్లు పంపిణీ చేయాలని వాళ్లే గొడవ చేస్తున్నారు. వాలంటీర్లపై ఎల్వీ సుబ్రమణ్యం, నిమ్మగడ్డ రమేష్‌లతో ఫిర్యాదులు ఇప్పించింది చంద్రబాబు అనేది బహిరంగ రహస్యం. వాలంటీర్లని అడుగడునా దూషించిన చంద్రబాబు నేడు  వాలంటీర్లకు తాను అధికారంలోకి వస్తే పదివేలిస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

Advertisement
Advertisement