స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!
Breaking News
‘తెలంగాణ ఆపిల్’గా ఆపిల్ బేర్!
Published on Tue, 12/22/2015 - 08:44
నామకరణం చేసిన ఉద్యాన శాఖ
రాష్ర్టంలో ఈ పంటను భారీగా ప్రోత్సహించాలని ప్రణాళికలు
ఎకరాకు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఆదాయం
వర్షాభావ ప్రాంతాల్లోనూ విరివిగా దిగుబడి
35 శాతం రాయితీ ఇవ్వాలని ప్రాథమిక నిర్ణయం
హైదరాబాద్: రేగు జాతికి చెందిన ఆపిల్ బేర్ కాయ.. థాయ్లాండ్లో పుట్టి బంగ్లాదేశ్ మీదుగా మహారాష్ట్రకు చేరుకుంది. ఐదేళ్లుగా అక్కడి రైతులు విరివిగా పండిస్తున్నారు. ప్రస్తు తం హైదరాబాద్ మార్కెట్లో దాదాపు కిలోకు రూ.100కు ఈ కాయలు లభ్యమవుతున్నాయి. ఆపిల్లో ఉండే అన్ని పోషకాల కన్నా ఎక్కువగా బేర్ కాయలో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆపిల్ బేర్కు రాష్ట్ర ఉద్యాన శాఖ అధికారులు ‘తెలంగాణ ఆపిల్’గా నామకరణం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో దీన్ని కేవ లం 50 ఎకరాల్లో పండిస్తున్నారు. దీని సాగు ను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ఉద్యాన శాఖ నిర్ణయించింది. వచ్చే ఏడాది తెలంగాణ ఆపిల్ను కనీసం వెయ్యి ఎకరాల్లో పండిచాలని భావిస్తోంది. ఇందుకు అయ్యే ఖర్చులో 35 శాతం సబ్సిడీ కింద ఇవ్వాలని యోచిస్తోంది.
ఎకరాకు పెట్టుబడి రూ.20 వేలే..
కేవలం రూ.20 వేల పెట్టుబడితో ఎకరా విస్తీర్ణంలో ఆపిల్ బేర్ను వేయొచ్చు. అందులో రైతుకు 35 శాతం సబ్సిడీ (రూ.7 వేలు) ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ పంటపై సాంకేతిక కమిటీ ఏర్పాటు చేసి సబ్సిడీపై పూర్తి స్థాయి నిర్ణయం తీసుకోనున్నారు. ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో వివిధ జిల్లాల్లో ఉన్న క్షేత్రాల్లో ప్రయోగాత్మకంగా ఈ పంట వేయాలని నిర్ణయించారు. అందుకోసం కోల్కతా నుంచి దాదాపు 3 వేల మొక్కలు తేనున్నారు.
ఎకరాకు రూ. 20 లక్షల ఆదాయం..
మొండిజాతి రకమైన ఈ ఆపిల్ బేర్ను బీడు భూముల్లో కూడా పండించవచ్చు. ఒకసారి మొక్కలు నాటితే వందేళ్ల వరకు పంట కొనసాగుతూనే ఉంటుంది. కేవలం యాజమాన్య పద్ధతులు పాటిస్తే సరిపోతుంది. మొక్క నాటిన ఏడాది నుంచే పంట చేతికి వస్తుంది. రెండు మూడేళ్ల వరకు రూ.లక్ష నుంచి 2 లక్షల ఆదాయం వచ్చినా, తర్వాత ఎకరాకు రూ.20 లక్షల వరకు ఆదాయం సమకూరుతుందని ఉద్యాన శాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. మహారాష్ర్టలోని షో లాపూర్కు చెందిన ఓ రైతు ఎకరంలో నాటిన 200 మొక్కల ద్వారా ప్రస్తుతం రూ.20 లక్షలకు పైగా ఆదాయం సంపాదిస్తున్నాడని చెప్పారు. ఒక్కో చెట్టుకు దాదాపు 250 కిలోల కాయలు కాస్తున్నాయని వివరించారు. హోల్సేల్గా కిలో కాయలకు రూ.40కి విక్రయిస్తున్నాడన్నారు. వర్షాభావ ప్రాంతాల్లో కూడా ఈ చెట్లకు ఢోకా ఉండదని చెప్పారు. ఈ జాతికి చీడ పీడలు తక్కువ. పైగా పోషక విలువలు ఎక్కువగా ఉండటంతో ప్రతి గ్రామంలో కనీసం 50 ఎకరాల వరకు ఈ పంటను ప్రోత్సహిస్తే అక్కడి ప్రజలు ఆరోగ్యపరంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని పేర్కొన్నారు. ఈ పంట అధ్యయనానికి మహారాష్ట్రకు తెలంగాణ రైతు బృందాన్ని పంపిస్తామన్నారు. కాగా, ఒక్కో కాయ పావు కిలో వరకు తూగుతుందని, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని నేలలు ఈ పంటకు అనుకూలమైనవని నిపుణులు పేర్కొంటున్నారు. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై తదితర రాష్ట్రాల్లో ఈ కాయలకు డిమాండ్ బాగా ఉంది.
Tags