Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
ఆచితూచి అడుగులు...
Published on Tue, 01/06/2015 - 23:12
ఆ మధ్య ‘ప్రేమ కథా చిత్రమ్’ సినిమా ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించిన యువ హీరో కథానాయకుడు సుధీర్బాబు. గమ్మత్తేమిటంటే, అంత పెద్ద వాణిజ్య విజయం తరువాత చకచకా సినిమాలు చేస్తూ, తెగ బిజీగా ఉంటారని ఎవరైనా అనుకుంటారు. కానీ, ఈ యువ హీరో మాత్రం హడావిడి పడడం లేదు. ఇటీవలే ముగిసిన 2014లో ఆయన నటించిన ఒక్క చిత్రం కూడా రిలీజ్ కాలేదు. ‘‘ఒక ఘన విజయం తరువాత ఎవరి మీదైనా అంచనాలుంటాయి. అలాగే నా మీద కూడా! మధ్యలో చేసిన ‘ఆడు మగాడ్రా బుజ్జి’ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. అందుకే, మంచి కథలు, వైవిధ్యభరితమైన స్క్రిప్టులు ఎంచుకోవాలని చూస్తున్నా’’ అని సుధీర్బాబు చెప్పారు. అయితే, ఈ కొత్త ఏడాదిలో ఏకంగా ఒకటికి నాలుగు సినిమాలు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
నటనకు సంబంధించి తనను తాను మెరుగుపరుచుకొనేందుకు కృషి చేస్తున్న ఈ ఉత్సాహవంతుడు త్వరలోనే ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ...’ అనే చిత్రం ద్వారా పలకరించనున్నారు. ఈ వినోదాత్మక ప్రేమ కథ నటుడిగా తన సత్తా చాటుతుందని ఆయన నమ్మకంగా చెబుతున్నారు. అలాగే, ‘స్వామి రారా’ చిత్రం సీక్వెల్ కూడా శరవేగంతో సిద్ధమవుతోంది. మరో రెండు చిత్రాలకు సంతకం చేసే పనిలో ఉన్నారు. ‘‘ఈ కొత్త ఏడాది అంతా బిజీగా సాగనుంది’’ అంటున్నారాయన. మొత్తానికి, నిరుటి కరువు కూడా తీరుస్తూ, ఈసారి ఆయన సినిమాలు నాలుగు రిలీజ్ కావడం సిద్ధమన్న మాట! ఇంకేం! ఆల్ ది బెస్ట్ సుధీర్!
Tags