స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!
Breaking News
జగన్ పొత్తు ఎప్పుడూ ప్రజలతోనే..
Published on Wed, 04/03/2019 - 04:21
సాక్షి, శ్రీకాకుళం/సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రజలంతా తమ కుటుంబమేనని.. వారితోనే జగన్ పొత్తు అని వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ స్పష్టం చేశారు. తొమ్మిదేళ్లుగా తన తండ్రి రాజశేఖరరెడ్డి బాటలో నడుస్తున్న జగన్ను ఒక్కసారి ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ముందు పెద్దన్న అవతారమెత్తి.. దొంగ ప్రేమ చూపిస్తున్న చంద్రబాబును నమ్మి మళ్లీ మోసపోవద్దని ప్రజలకు సూచించారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం జి.సిగడాం, విజయనగరం జిల్లా తెర్లం, సాలూరులో విజయమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభల్లో ఆమె ఏం మాట్లాడారంటే..
మన బంధాన్ని ఎవరూ విడదీయలేరు..
రాజశేఖరరెడ్డిగారు గానీ, జగన్ గానీ ప్రజల్ని తమ కుటుంబంగా భావిస్తారు. ప్రజల ఇబ్బందులు తెలుసుకునేందుకు రచ్చబండకు వెళ్తూ రాజశేఖరరెడ్డిగారు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆయన చనిపోయాక రాష్ట్రాన్ని ముక్కలు చేశారు. ఎలాంటి అభివృద్ధీ జరగడం లేదు. కాంగ్రెస్, టీడీపీ పెద్దలు నిరంకుశత్వంగా సీబీఐ, ఈడీతో జగన్బాబును జైల్లో పెట్టించాయి. ఆస్తులు అటాచ్ చేయించి.. మమ్మల్ని రోడ్డు మీదకు లాగారు. కానీ జగన్ తన కష్టాలను, బాధలను ఏనాడూ మీకు చెప్పుకోలేదు. రాష్ట్రం బాగుపడాలని ప్రత్యేక హోదా కోసం పోరాటాలు, ఉద్యమాలు చేశాడు. కడుపు మాడ్చుకొని నిరాహార దీక్షలు చేశాడు. ప్రజలకు ఎక్కడ కష్టం ఉంటే.. జగన్ అక్కడ వాలేవాడు. రాష్ట్రంలో మరే నాయకుడూ ఇంతలా కష్టపడలేదు. నెలలో 25 రోజుల పాటు మీతోనే ఉండేవాడు. మీకు, మాకూ ఉన్న అనుబంధాన్ని ఎవరూ విడదీయలేరు. మీ ఆశీర్వాద బలంతోనే జగన్ పెద్ద గండం(విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నం) నుంచి తప్పించుకున్నాడు. మీకెప్పుడూ మేం రుణపడి ఉంటాం. మీకు మంచి చేయాలని జగన్ తపనపడుతున్నాడు. అందుకే నవరత్న పథకాలకు రూపకల్పన చేశాడు. ఒక్కసారి ఆలోచించండి. న్యాయానికి, అన్యాయానికి జరుగుతున్న యుద్ధమిది. విలువలు, విశ్వసనీయతకు పట్టం కట్టండి. జగన్ వైఎస్ బిడ్డ. మాటిస్తే తప్పడు. 600కు పైగా హామీతో అన్ని వర్గాలను మోసం చేసిన నీచ చరిత్ర చంద్రబాబుది అయితే.. ఉచిత విద్యుత్ వంటి ప్రజా సంక్షేమ పథకాలకు సంతకాలు చేసి అమలు చేసిన ఘనత వైఎస్సార్ది.
జగన్ కష్టాన్ని గుర్తు తెచ్చుకొని ఓటేయండి..
ప్రత్యేక హోదా ఇచ్చిన వారికే మద్దతు. 25 మంది ఎంపీలను గెలిపించుకుందాం. ఒక్క అవకాశమిచ్చి జగన్ను గెలిపించండి. ఓటు వేసేటప్పుడు మీ గుండెల్లో పెట్టుకున్న వైఎస్సార్ను తలుచుకోండి. జగన్ కష్టం గుర్తు తెచ్చుకోండి. జగన్ ఒక మాటిచ్చాడంటే దానిని నిలబెట్టుకుంటాడని.. అతని తల్లిగా నేను మీకు మాటిస్తున్నా. వైఎస్సార్సీపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించండి. ప్రత్యేక హోదా సాధించుకుందాం.
‘బొబ్బిలి’ వారసుడు వెన్నుపోటుదారుడయ్యాడు..
బొబ్బిలి యుద్ధంలో అప్పటివారు విలువలు కాపాడుకున్నారు. వెన్నుపోటు పొడవలేదు. కానీ వారి వారసులుగా చెప్పుకుంటున్న సుజయ్ కృష్ణా రంగారావు ఏం చేశారు? మీకూ, మాకూ వెన్నుపోటు పొడిచి.. అతిపెద్ద వెన్నుపోటుదారుడైన చంద్రబాబు దగ్గరకు వెళ్లాడు. సరే ఆయన ఏమైనా అభివృద్ధి చేశాడా? అంటే అదీ లేదు. ఒక్క సాగునీటి ప్రాజెక్టు తెచ్చారా? షుగర్ ఫ్యాక్టరీ నుంచి రైతులకు బకాయిలు ఇప్పించారా? బొబ్బిలికి తాగునీరు తెప్పించారా? వారు చేస్తున్నదల్లా.. విజయనగరం జిల్లాలో గనులు తవ్వుకోవడము. ఇసుక అమ్ముకోవడము, చెరువులు కబ్జా చేయడమే. వెంగళరాయ సాగర్ అదనపు ఆయకట్టుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిధులు మంజూరు చేస్తే నేటికీ పనులు చేయలేదు. ఇటువంటి నాయకులు మనకు అవసరమా? బలహీన వర్గాల పట్ల నిజమైన ప్రేమ ఉండేది ఒక్క జగన్కే. బీసీలకు నామినేటెడ్ పదవుల్లో యాభై శాతం ఇస్తామని జగన్ హామీ ఇచ్చాడు. జగన్ విలువలకు, విశ్వనీయతకు కట్టుబడి రాజకీయాలు చేస్తున్నాడు. విజయనగరం జిల్లాలో బీసీలకు, వైశ్యులకు సీట్లిచ్చిన ఘనత వైఎస్ జగన్దే.
ఐదేళ్లు ఏం చేశావ్?
చంద్రబాబు ఈ ఐదేళ్లలో ఇసుక, మట్టి, భూములను దోచుకున్నాడు. రాజశేఖరరెడ్డి గారు రైతును రాజును చేస్తే.. చంద్రబాబు రుణమాఫీ పేరుతో రైతుల్ని నట్టేట ముంచాడు. వైఎస్సార్ శ్రీకాకుళం జిల్లాలోని వంశధార ప్రాజెక్టులో 70 శాతం పనులు పూర్తి చేస్తే.. చంద్రబాబు హయాంలో మిగిలిన పనులు ఒక్క అంగుళం కూడా కదలలేదు. మహేంద్ర తనయ, తోటపల్లి ప్రాజెక్టు పరిస్థితీ ఇంతే. కనీసం శ్రీకాకుళం జిల్లాకు చెందిన 13 మంది మత్స్యకారులు పాకిస్తాన్లో చిక్కుకుపోయినా పట్టించుకోలేదు. చేనేత కార్మికులకు చెల్లించాల్సిన రూ.వందల కోట్ల బకాయిలివ్వలేదు. జగన్ సీఎం అయ్యాక ఆగిపోయిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాడు. మత్స్యకారులకు వేట విరామ సమయంలో రూ.10 వేలు ఇస్తాడు. బకాయిలన్నీ చెల్లిస్తాడు. జగన్ అధికారంలోకి వస్తే వలసలుండవు. ఇక్కడే ఉపాధి కల్పిస్తాడు.
ఒక్క ప్రాజెక్టయినా పూర్తి చేశావా?
చంద్రబాబు ఇప్పటివరకు 14 ఏళ్లు రాష్ట్రాన్ని పరిపాలించాడు. ఒక్క ప్రాజెక్టయినా తీసుకొచ్చాడా? కనీసం ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశాడా? వైఎస్సార్ పోలవరానికి జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు తెచ్చారు. కాలువలు తవ్వారు. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. రూ.16 వేల కోట్ల నుంచి రూ.60 వేల కోట్లకు పైగా అంచనా వ్యయాన్ని పెంచేశాడు. బినామీలకు దోచిపెట్టాడు. పోనీ ప్రాజెక్టునైనా పూర్తి చేశాడా అంటే అదీ లేదు. సాగునీటి ప్రాజెక్టుల్లో రూ.వేల కోట్ల అవినీతికి పాల్పడ్డాడని సాక్షాత్తూ ‘కాగ్’ వెల్లడించింది. రాష్ట్రాభివృద్ధి గురించి చంద్రబాబు ఏనాడూ ఆలోచించలేదు. రాజశేఖరరెడ్డి గారు తన పాదయాత్రలో ప్రజల కష్టాలు, సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేశారు.
Tags