బ్యాంకులో రూ. 2.23 కోట్ల బంగారం చోరీ

Published on Tue, 09/07/2021 - 03:37

బాపట్ల: గుంటూరు జిల్లా బాపట్లలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీవోబీ)లో రూ.2.23 కోట్ల విలువైన 5 కిలోలకుపైగా బంగారం మాయమైంది. ఈ బంగారాన్ని కాజేసినవారు ఒక ప్రైవేటు ఫైనాన్స్‌ కంపెనీలో తాకట్టుపెట్టి రూ.60 లక్షలు తీసుకున్నారు. బ్యాంకు తాత్కాలిక ఉద్యోగి ప్యార్లీ సుమంత్‌రాజ్‌ పరారీలో ఉన్నాడు. దీనికి సంబంధించి ఇద్దరు అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకులో తాము కుదువపెట్టిన బంగారం మాయం కావడంతో ఖాతాదారులు సోమవారం బ్యాంకు వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకు తాత్కాలిక ఉద్యోగి సుమంత్‌రాజ్‌ సూత్రధారిగా ఈ చోరీ జరిగినట్లు డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు సోమవారం స్థానిక టౌన్‌ పోలీసు స్టేషన్‌లో విలేకరులతో చెప్పారు.

తమ బ్యాంకులో ఖాతాదారులు కుదువ పెట్టుకున్న రూ.2.23 కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా రీజనల్‌ మేనేజర్‌ విద్యాసాగర్‌ ఆదివారం రాత్రి ఫిర్యాదు చేశారని తెలిపారు. పరారీలో ఉన్న సుమంత్‌రాజ్‌ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని, ఈ వ్యవహారంలో ఇంకా ఎవరి పాత్ర ఉందనే విషయాన్ని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. చోరీచేసిన 5 కిలోల 8 గ్రాముల బంగారంలో 80 శాతాన్ని ఓ ఫైనాన్స్‌ కంపెనీలో తాకట్టు పెట్టి రూ.60 లక్షలు తీసుకున్నట్లు గుర్తించారు. తాకట్టు పెట్టేందుకు సహకరించారనే అనుమానంతో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సీఐలు పి.కృష్ణయ్య, కడప శ్రీనివాసరెడ్డి, ఎస్‌.ఐ.లు మహ్మద్‌రఫీ, వెంకటప్రసాద్‌ తదితరులు దర్యాప్తు చేస్తున్నారు.

చోరీ బయటపడింది ఇలా..
విశ్వసనీయ సమాచారం మేరకు ఈ చోరీ గురించి నిందితుడే బయటపెట్టాడు. సాధారణంగా బ్యాంకులో బంగారు ఆభరణాలపై ఏడాదిలో రెండు, మూడుసార్లు శాఖాపరమైన ఆడిట్‌ నిర్వహిస్తారు. బాపట్ల బీవోబీలో ఆభరణాలను తనిఖీ చేసేందుకు అధికారులు వస్తున్నట్లు ఈనెల ఒకటో తేదీన ప్రకటించారు. ఈ నేపథ్యంలో సుమంత్‌రాజ్‌ ఒకటి, రెండో తేదీల్లో విధులకు హాజరుకాలేదు. తన విషయం బయటపడి ఉంటుందని భావించిన అతడు మూడోతేదీన బ్యాంకు ఉద్యోగి ఒకరికి.. తాను తన తల్లికి ఆపరేషన్‌ చేయించేందుకు బంగారు ఆభరణాలు తీసుకున్నానని వాట్సాప్‌ ద్వారా సమాచారం ఇచ్చాడు. ఆ ఆభరణాలను ప్రైవేటు ఫైనాన్స్‌ కంపెనీలో తాకట్టు పెట్టేందుకు సహకరించిన ఇద్దరి పేర్లను మరో మెసేజ్‌లో తెలిపినట్లు సమాచారం. దీంతో బ్యాంకు అధికారులు రీజనల్‌ మేనేజర్‌కు సమాచారం ఇచ్చి శాఖాపరమైన విచారణ చేపట్టారు. మొత్తం రూ.2.23 కోట్ల విలువైన ఆభరణాలు చోరీ అయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ