Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
వద్దిరాజు నామినేషన్ దాఖలు
Published on Fri, 05/20/2022 - 01:37
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ఉపఎన్నిక స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర గురువారం నామినేషన్ దాఖలు చేశారు. శాసనసభలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి కుటుంబసభ్యులు, పలువురు రాష్ట్రమంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి వచ్చిన వద్దిరాజు శాసనసభ కార్యదర్శి, రిటర్నింగ్ అధికారికి మూడు సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. అంతకుముందు టీఆర్ఎస్ కార్యకర్తలతో కలసి అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కుకు చేరుకుని అమరుల స్తూపానికి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్రావు, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్, సత్యవతి రాథోడ్, వి.శ్రీనివాస్గౌడ్, పువ్వాడ అజయ్, కొప్పుల ఈశ్వర్ తదితరులు వద్దిరాజును అభినందించారు. ఈ నెల 20న నామినేషన్ పత్రాలను పరిశీలిస్తారు. 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవ ఎన్నికను అధికారికంగా ప్రకటిస్తారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్దన్, దాస్యం వినయ్భాస్కర్, వివేకానంద, జీవన్రెడ్డి, నన్నపునేని నరేంద ర్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, బండా ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
నామినేషన్ ప్రక్రియ అనంతరం పబ్లిక్ గార్డెన్స్లోని లాన్ లో తెలంగాణ మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో వద్దిరాజుకు ఆత్మీయ సత్కార సభ నిర్వహించారు. హైదరాబాద్లోని మున్నూరుకాపుల ఆత్మగౌరవ భవనాన్ని జూన్ 9న కేసీఆర్ ప్రారంభించనున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
Tags