జేఈఈ మెయిన్స్లో సత్తాచాటిన గిరిజన బాలికలు
Breaking News
నేడే కోదండరాముడి కల్యాణం
Published on Thu, 03/30/2023 - 08:25
డాబాగార్డెన్స్: లోకాభిరాముడు.. శ్రీరాముడు జానకిని పరిణయమాడే సుముహూర్తం సమీపించింది. ఇందుకు జగదాంబ జంక్షన్ సమీపంలోని మహారాణిపేట అంబికాబాగ్ రామాలయం సిద్ధమైంది. గురువారం జరిగే రాములోరి పెళ్లికి ఆలయ వర్గాలు, ధర్మకర్తల మండలి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే కల్యాణంలో పాల్గొనే దంపతులకు ఆహ్వా నం పలికింది. భక్తులు పెద్ద ఎత్తున తరలి రానున్న దృష్ట్యా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టారు. ఆలయాన్ని మిరమిట్లు గొలిపే విద్యుత్ దీపాలతో అలంకరించారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం సుమారు 5వేల మందికి అన్నప్రసాదం అందజేయనున్నారు.
కార్యక్రమాలివీ..
శ్రీరామ నవమి ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం 5 గంటలకు స్వామి ఉత్సవమూర్తులకు పంచామృతాభిషేకాలు నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుంచి స్వామి కల్యాణం అత్యంత వైభవంగా చేపట్టనున్నారు. అనంతరం ఐదు వేల మంది భక్తులకు కల్యాణ విందు ఏర్పాటు చేశారు. శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిని దర్శించుకోనున్నారు. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ దంపతులు కల్యాణంలో పాల్గొననున్నారు. 31న శ్రీరామ పట్టాభిషేకం నిర్వహిస్తారు. కల్యాణ ఉత్సవంలో పాల్గొనే భక్తులు రూ.1,116 చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలి.
మరిన్ని వివరాలకు 0891–2528645, 2566514 నంబర్లలో సంప్రదించవచ్చు. ఈ సందర్భంగా కనకమహాలక్ష్మి ఆలయ నూతన ఈవో రమేష్నాయుడు మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ధర్మకర్తల మండలి చైర్పర్సన్ సింహాచలం మాట్లాడుతూ గతేడాది శ్రీరామనవమి ఉత్సవంలో తలెత్తిన ఇబ్బందుల దృష్ట్యా ఈ ఏడాది ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా పెండాల్స్ ఏర్పాటు చేశామని, దాతల సహకారంతో మజ్జిగ పంపిణీ చేయనున్నట్టు చెప్పారు.
Tags