సముద్రంలో మునిగి ఇద్దరు యువకుల మృతి

17 Jul, 2017 01:23 IST|Sakshi
సముద్రంలో మునిగి ఇద్దరు యువకుల మృతి
మరో ముగ్గురు ఆస్పత్రికి తరలింపు.. అంతా హైదరాబాద్‌ వాసులే
 
సాగర్‌నగర్‌ (విశాఖ తూర్పు): సెలవు రోజు కావడంతో ఆదివారం సరదాగా రుషికొండ బీచ్‌కు వెళ్లిన ఇద్దరు యువకులు మృత్యువాతపడగా, మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన అక్బర్, హుస్సేన్, మోహిజ్, రాహుల్‌ ఉపాధ్యాయ, నావల్‌ అనే ఐదుగురు యువకులు డైమండ్‌ పార్కు వద్ద ఇటీవల ఏర్పాటు చేసిన కరాచీవాలా దుకాణంలో పని చేసేందుకు వచ్చారు. మురళీనగర్‌లో ఓ రూమ్‌ అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నారు. వీరంతా విశాఖకు చెందిన యూసఫ్‌ అనే మరో యువకుడితో కలసి ఆదివారం ఉదయం రుషికొండ బీచ్‌కు వెళ్లారు.

యూసఫ్‌ ఒడ్డునే ఉండగా హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు యువకులు సముద్రంలో స్నానం చేసేందుకు దిగారు. అలల తాకడికి వీరంతా ప్రమాదంలో చిక్కుకోవడాన్ని గమనించిన యూసఫ్‌ కేకలు వేయగా సమీపంలో ఉన్న ఇద్దరు మత్స్యకార యువకులు వచ్చి వారిని ఒడ్డుకు చేర్చారు. అయితే అప్పటికే రాహుల్‌ ఉపాధ్యాయ (33), నావల్‌ (25) మృతి చెందారు. తీవ్ర అస్వస్థతతకు గురైన అక్బర్, హుస్సేన్, మోహిజ్‌లను సమీపంలోని గీతం ఆస్పత్రికి తరలించడంతో వారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.  పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  
మరిన్ని వార్తలు