స్టోరేజ్ ట్యాంకులో పడి విద్యార్థుల గల్లంతు

20 Feb, 2016 09:03 IST|Sakshi
ఆదోని: కర్నూలు జిల్లా ఆదోని పట్టణ శివారులోని బత్తలాపురం సమ్మర్‌స్టోరేజ్ ట్యాంకులో పడి ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తిరుమలనగర్‌కు చెందిన సాబిర్(13), శివశంకరనగర్‌కు చెందిన జిలాని(14) మరో ముగ్గురు స్నేహితులు శుక్రవారం సాయంత్రం ఈతకొట్టేందుకు వెళ్లారు. సాబిర్, జిలాని ఇద్దరూ ఈత కొడుతూ నీటిలో మునిగిపోయారు.
 
గట్టున చూస్తున్న మిగిలిన ముగ్గురు పిల్లలు భయంతో పారిపోయారు. ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. సాబిర్, జిలాని రాత్రి ఎంత సేపటికీ ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు అర్థరాత్రి తరువాత పట్టణ పోలీసులను ఆశ్రయించారు. ఈ హడావుడి చూసిన మిగిలిన పిల్లలు భయంతో అసలు విషయం చెప్పారు. శనివారం ఉదయం పోలీసులు, కుటుంబసభ్యులు సమ్మర్ స్టోరేజి ట్యాంకు వద్దకు వెళ్లి పిల్లల కోసం గాలింపు చేపట్టారు. వారి ఆచూకి ఇంకా దొరకలేదు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నీటిలో మునిగిపోయిన ఇద్దరు విద్యార్థులు మున్సిపల్ హైస్కూల్‌లో 7వ తరగతి చదువుతున్నారు.
మరిన్ని వార్తలు