కోర్టు కొలువుల పేరుతో కుచ్చుటోపీ

22 Nov, 2013 02:48 IST|Sakshi

హైదరాబాద్, న్యూస్‌లైన్: హైదరాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కోర్టులో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇప్పిస్తానంటూ ఓ కేటుగాడు నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టాడు. సుమారు 25 మంది నుంచి భారీగా డబ్బు వసూలు చేసి నకిలీ జాయినింగ్ ఆర్డర్ కాపీలిచ్చి పరారయ్యాడు. ఈ ఘటనపై హైదరాబాద్‌లోని డబీర్‌పురా పోలీస్‌స్టేషన్‌లో గురువారం కేసు నమోదైంది. ఇన్‌స్పెక్టర్ రంగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం 2010లో అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కోర్టు జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు పరీక్షలు నిర్వహించగా, 2011లో ఫలితాలు వెలువడ్డాయి.

ఈ సమయలో ఉత్తీర్ణత కాని అభ్యర్థుల జాబితాను తీసుకున్న ఓ వ్యక్తి 25 మందికి ఉద్యోగం ఇప్పించేందుకు రూ. 50 వేలకు బేరం కుదుర్చుకొని ముందస్తుగా రూ. 25 వేల చొప్పున వసూలు చేశాడు. ఇందులో 15 మంది గురువారం పురానీహవేళీలోని ట్రిబ్యూనల్ కోర్టులో ఉద్యోగంలో చేరేందుకై జాయినింగ్ ఆర్డర్ కాపీతో వచ్చారు. ఈ ఆర్డర్ కాపీలను గమనించిన కోర్టు రిజిస్ట్రార్ చలపతి రావు నకిలీవని గుర్తించి డబీర్‌పురా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
 

మరిన్ని వార్తలు