ఆర్టీవో ఆఫీసుపై ఏసీబీ దాడి

28 Jul, 2018 13:40 IST|Sakshi

రవాణాశాఖ  గుడివాడ ప్రాంతీయ కార్యాలయంపై శుక్రవారం ఏసీబీ అధికారులు దాడి చేశారు. కార్యాలయంలో 14 మంది దళారులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు. లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఆన్‌లైన్‌లో నిర్వహించే పరీక్ష పాస్‌ చేసేలా అనధికారిక వ్యక్తులు సాయం చేస్తున్నారని ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందాయి. 

గుడివాడ టౌన్‌ : గుడివాడ రాజేంద్ర నగర్‌ లోని రవాణా శాఖ ప్రాంతీయ కార్యాలయంలో  ఏసీబీ అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేశారు.  ఐదుగురు సిబ్బందితో జరిపిన ఈ తనిఖీల్లో 14 మంది దళారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ ఎస్‌వివి ప్రసాదరావు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆర్టీవో ఏజెంట్లకు కార్యాలయంలో ప్రవేశం లేదన్నారు. వీరు కంప్యూటర్‌ల వద్ద తిష్ట వేసి టెస్ట్‌కు హాజరయ్యే వారిని ఉత్తీర్ణులయ్యేలా కార్యాలయ ఉద్యోగులతో లాలూచీ  పడి లైసెన్స్‌లకు దరఖాస్తు  చేసిన వారిని పాస్‌ చేసేలా పనిచేస్తున్నారని.. ఇది చట్టరీత్యా నేరమన్నారు. దీనిపై తనిఖీలు చేశామన్నారు. అదుపులోకి తీసుకున్న వారి నుంచి లక్ష రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దీనిపై రవాణా శాఖ ఉన్నత అధికారులకు నివేదిక ఇస్తామని అనంతరం తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ సిబ్బంది,పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు