కొలువుల కలవరం

16 Aug, 2013 00:38 IST|Sakshi

* షెడ్యూళ్లతో సహా సర్వసన్నద్ధంగా అధికారులు
* 21 లక్షల మంది నిరుద్యోగుల ఎదురుచూపులు
* సర్కారు సరేననదు.. నోటిఫికేషన్ రాదు..
 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 21 లక్షల మందికి పైగా నిరుద్యోగులు ఎదురుచూస్తున్నది ప్రధానంగా ఏపీపీఎస్సీ, డీఎస్సీలతో పాటు పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు నుంచి జారీ కావాల్సిన నోటిఫికేషన్ల కోసమే. రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో వీటి జారీపై ప్రతిష్టంభన నెలకొంది. నోటిఫికేషన్ల జారీ, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి తదితరాలతో కూడిన షెడ్యూళ్లను రూపొందించుకొని మరీ సంబంధిత విభాగాలు ఇప్పటికే పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాయి.

కానీ రాష్ట్ర విభజనకు యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో నోటిఫికేషన్ల జారీని ఆయా శాఖలు నిలిపేశాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగ నోటిఫికేషన్ల షెడ్యూలు, జారీపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ ఏపీపీఎస్సీ వంటి విభాగాలు పది రోజుల కిందటే ప్రభుత్వానికి లేఖలు రాశాయి. అయినా సర్కారు నుంచి స్పందన గానీ, ఎలాంటి స్పష్టత గానీ లేదు!
 
సీఎం స్పందిస్తేనే...
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రులు సమష్టిగా నిర్ణయం తీసుకుంటే తప్ప నోటిఫికేషన్లు జారీ కావు. అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణలకు చెందిన ఎందరో నిరుద్యోగులు ఐదారు రోజులుగా కిరణ్‌ను కలుస్తూనే ఉన్నారు, నోటిఫికేషన్ల జారీకి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. ఆయన నుంచి సానుకూల హామీ రావడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. జాయింట్ సర్వీస్ కమిషన్ ఏర్పడ్డాకే నోటిఫికేషన్లు జారీ అవుతాయని పలువురు ప్రజాప్రతినిధులు చెబుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ల జారీపై ప్రభుత్వమే స్పష్టత ఇవ్వాలని నిరుద్యోగులు కోరుతున్నారు.

కోచింగ్ కేంద్రాల్లో లక్షపైనే..
పలు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తూ రాష్ట్రవ్యాప్తంగా లక్ష మందికి పైగా ఉద్యోగార్థులు కోచింగ్ కేంద్రాల్లో శిక్షణ పొందుతున్నట్టు అంచనా. చాలామంది ఉద్యోగులు కూడా సెలవులు పెట్టి మరీ గ్రూప్-1, గ్రూప్-2 తదితరాల కోసం సిద్ధమవుతున్నారు. ఇక చాలీచాలని జీతాలపై ఆధారపడే లక్షల మంది ప్రైవేటు స్కూల్ టీచర్లు కూడా సెలవులు పెట్టి, అప్పులు చేసి మరీ డీఎస్సీకి సిద్ధమవుతున్నారు. కోచింగ్‌లకే వేలకు వేలు పోశామంటూ ప్రస్తుత పరిస్థితులపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నోటిఫికేషన్లు ఇస్తారో లేదో స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
 
ఏపీపీఎస్సీ, పోలీసు పరీక్షలకే 16.5 లక్షల మంది
2011లో 314 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ప్రకటించిన గ్రూప్-1 రాత పరీక్షలకు ఏకంగా 3,03,710 మంది దరఖాస్తు చేసుకున్నారు! దాదాపు 873 గ్రూప్-2 పోస్టుల కోసం 4,52,669 దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఈసారీ ఆ రెండింటికి అదే స్థాయిలో స్పందన ఉండనుంది. ఇక 2011లో 1,489 గ్రూప్-4 పోస్టుల భర్తీకి 6.67 ల క్షల దరఖాస్తులొచ్చాయి. ఈసారి గ్రూప్-4 పోస్టులకు అంతకంటే ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునేలా ఉన్నారు. ఇక 2,677 గ్రామ కార్యదర్శి పోస్టులకు దాదాపు లక్ష మంది పోటీ పడవచ్చు. ఇక ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదం వచ్చి, పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయాల్సిన 11,623 కానిస్టేబుల్స్, సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల కోసం కనీసం 1.5 లక్షల మంది పోటీ పడనున్నారు.
 
 డీఎస్సీకి 5 లక్షల మంది
 వచ్చే నవంబర్ 9, 10 తేదీల్లో విద్యా శాఖ నిర్వహించాలనుకున్న డీఎస్సీలో 20,508 పోస్టులున్నాయి. వీటిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,532, పండిట్ 1,425, సెకండరీ గ్రేడ్ టీచర్ 16,287, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు 264 ఉన్నాయి. వీటికి దాదాపు 5 లక్షల మంది దరఖాస్తు చేయనున్నారు. ప్రస్తుతం సెప్టెంబరు 1న నిర్వహించబోయే నాలుగో టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష)కు 4,44,718 మంది దరఖాస్తు చేసుకున్నారు.
 
వయసు మీరనున్న లక్షన్నర మంది...
రాష్ట్రంలో 2011 తరవాత ఇంతవరకూ ఉద్యోగ నోటిఫికేషన్లు రాలేదు. దాంతో ఐదేళ్ల వయో పరిమితి పెంపు కోసం 5 లక్షల మంది నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. కానీ ప్రభుత్వం మాత్రం ఈసారి రెండేళ్ల వయో పరిమితి పెంపుకే అంగీకరించింది. ప్రస్తుతం నోటిఫికేషన్లు వెలువడకపోతే ఆ అవకాశాన్ని కూడా కోల్పోయే వారు లక్షన్నర పై చిలుకేనని అంచనా.

>
మరిన్ని వార్తలు