అంగన్‌వాడీ కార్యకర్త అనుమానాస్పద మృతి

18 Oct, 2017 15:07 IST|Sakshi

మెంటాడ: మండలంలోని గుర్ల తమ్మిరాజుపేట శివారు పనుకువానివలస గిరిజన గ్రామానికి చెందిన టోకుర సన్యాసమ్మ(30) అనుమానాస్పద స్థితిలో చెట్టుకు మృతదేహమై వేలాడుతూ  కనిపించింది. అయితే తన కుమార్తెను భర్త టోకురు రమణ హత్య చేసి ఇలా నాటకం ఆడుతున్నాడని సన్యాసమ్మ తండ్రి సూరి ఆరోపించాడు. వివరాల్లోకి వెళ్తే...సన్యాసమ్మ గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మామిడి తోటల్లో ఓ చెట్టుకు చీరతో ఉరి వేసుకొని మృతదేహంగా మంగళవారం కనిపించింది. మృతురాలు సన్యాసమ్మ నోటి నుంచి రక్తం కారుతూ ఉన్నట్టు దీనికి రమణే కారణమని తండ్రి తెలిపారు.

సన్యాసమ్మ అంగన్‌వాడీ కార్యకర్తగా విధులు నిర్వహిస్తుంది.  గజపతినగరం ఐసీడీఎస్‌ కార్యాలయంలో మంగళవారం సమావేశం ఉందని సన్యాసమ్మ తన భర్త రమణతో కలిసే వెళ్లినట్టు కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు తెలిపారు. రమణ నిత్యం సన్యాసమ్మను కొట్టేవాడని వేధిస్తూ ఉండేవాడని అయినా ఆమె ఓర్పుతో ఉండేదని చెబుతున్నారు. వీరికి 15 ఏళ్ల కిందట వివాహమైంది. అప్పటి నుంచి రమణ అత్తింట్లోనే ఉంటున్నాడు. సన్యాసమ్మకు ఇద్దరు కుమార్తెలు స్వాతి, శైలజ ఉన్నారు. తండ్రి సూరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ఎస్‌.భాస్కరరావు సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేశారు. గజపతినగరం సీఐ ఏవీ లీలారావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు