అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.264.99 కోట్లు విడుదల

19 Oct, 2019 04:02 IST|Sakshi

రూ.10 వేల లోపు డిపాజిట్లు ఉన్న 3,69,655 మందికి పంపిణీ

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ఎన్నికల హామీ అమలులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాము అధికారంలోకి వచ్చాక అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకుంటామని ఇచ్చిన హామీని ఆచరణలోకి తెచ్చారు. మేనిఫెస్టోలో చెప్పినట్టుగా అగ్రిగోల్డ్‌ బాధితులకు ప్రభుత్వం తరపున చెల్లింపులు జరిపి ఆదుకుంటామంటూ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఈ మేరకు రూ.264,99,00,983 విడుదల చేస్తూ ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చింది. ఈ మొత్తాన్ని మొదట రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రూ.10 వేల లోపు డిపాజిట్లు కలిగిన 3,69,655 మందికి పంపిణీ చేయనున్నారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి కేఆర్‌ఎం కిషోర్‌కుమార్‌ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు.

బడ్జెట్‌లో రూ.1,150 కోట్లు కేటాయింపు
చంద్రబాబు అధికారంలో ఉండగా అగ్రిగోల్డ్‌ బాధితులను పట్టించుకోకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగిన విషయం తెల్సిందే. అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోవాలని నాడు ప్రతిపక్ష  నేతగా ఉన్న వైఎస్‌ జగన్‌ కోరినా చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. రెక్కాడితే గానీ డొక్కాడని కూలీలు, పేదలు, మధ్యతరగతి వర్గాలు అగ్రిగోల్డ్‌లో డిపాజిట్‌ చేసి నష్టపోయారు. ప్రజా సంకల్ప పాదయాత్ర సందర్భంగా పలు చోట్ల అగ్రిగోల్డ్‌ బాధితులు తమను ఆదుకోవాలని మొరపెట్టుకున్నారు. అగ్రిగోల్డ్‌ బాధితుల భరోసా కమిటీ ద్వారా వైఎస్‌ జగన్‌ వారికి బాసటగా నిలిచారు.

ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం జరిగిన మంత్రివర్గ సమావేశంలో అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకునేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే బడ్జెట్‌లో రూ.1,150 కోట్లు కేటాయించారు. తాజాగా తొలిదశలో రూ.264,99,00,983 రాష్ట్రంలోని 3,69,655 మంది డిపాజిటర్లకు పంపిణీ చేసేలా ఉత్తర్వులు ఇచ్చారు. హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా లీగల్‌ సెల్‌ అథారిటీ చైర్మన్, కలెక్టర్లు ప్రతిపాదించిన ప్రకారం రూ.10 వేల లోపు డిపాజిటర్ల జాబితాకు అనుగుణంగా పంపిణీ చేయనున్నారు. రూ.20 వేల డిపాజిట్లకు సంబంధించి కూడా పరిశీలన జరుగుతున్నట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు