నిర్లక్ష్యం ఖరీదు ఓ పసిప్రాణం..!

27 Aug, 2015 11:57 IST|Sakshi
నిర్లక్ష్యం ఖరీదు ఓ పసిప్రాణం..!

వెంటిలేటర్‌పై ఉన్న శిశువుపై ఎలుకల దాడి
వైద్యుల నిర్లక్ష్యంతో మృత్యు ఒడిలోకి..
ఎలుకలకు మేం కాపలా కాయాలా..అంటూ తల్లిపై వైద్యుల ఆగ్రహం

 
గుంటూరు: జబ్బుతో ఉన్న బిడ్డను వైద్యం కోసం ప్రభుత్వాస్పత్రికి తీసుకువస్తే.. అక్కడి వైద్యులు అసలు ప్రాణాలు లేకుండానే చేశారు.ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచిన శిశువును ఎలుకల బారి నుంచి కాపాడేందుకు కనీస చర్యలు తీసుకోలేదు. అప్పటికే ఓసారి శిశువుపై ఎలుకలు దాడిచేశాయని ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి అధికారులు, వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ నిండు పసిప్రాణం బలైంది. పది గంటల తర్వాత తీరుబడిగా డెత్ డిక్లేర్ (మరణ ధ్రువీకరణ)కు వైద్యులు రావడంతో తట్టుకోలేని ఆ తల్లి హృదయం  వైద్యులను నిలదీసింది.ఎలుకలకు మేం కాపలా ఉండాలా అని ఓ వైద్యుడు... ఇంకో బిడ్డ ఉన్నాడుగా ఈ బిడ్డపై ఆశలు వదులుకోమంటూ సిబ్బంది ఉచిత సలహా ఇవ్వడం వారి కర్కశత్వానికి అద్దం పట్టింది. విజయవాడ కృష్ణలంక కు చెందిన చావలి నాగ, లక్ష్మి దంపతులకు ఈ నెల 17న విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో రెండో సంతానంగా మగబిడ్డ జన్మించాడు.  శిశువుకు మూత్రసంచి, మూత్రనాళాలు బయటకు రావడంతో మెరుగైన వైద్యసేవల నిమిత్తం ఈ నెల 18న గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలోని శిశు శస్త్ర చికిత్సా విభాగానికి తరలించారు.

వైద్యులు ఈ నెల 20న శిశువుకు ఆపరేషన్ నిర్వహించి ఐసీయూలోని వెంటిలేటర్‌పై ఉంచారు. ఈ దశలోనే శిశువుపై ఈ నెల 24న ఎలుకలు దాడిచేసి కుడి చేయితోపాటు కాలి వేళ్లను కొరికివేశాయి.తీవ్ర ఆందోళనకు గురైన తల్లి లక్ష్మి వైద్యులు, ఆసుపత్రి అధికారులకు ఫిర్యాదు చేసింది. వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇలా బుధవారం తెల్లవారుజామున 4గంటల వేళ  రెండోసారి ఎలుకలు పసికందుపై దాడిచేసి ఛాతీ, ఎడమ కణిత, బుగ్గ భాగాలతోపాటు చేతివేళ్లు, కాలివేళ్లు కొరుక్కుతిన్నాయి. తీవ్ర రక్తస్రావం కావడం గమనించిన లక్ష్మి కదలలేని స్థితిలోనూ కేకలు వేస్తూ ఎలుకలను తోలే ప్రయత్నం చేసింది. వైద్యులుగానీ, సిబ్బందిగానీ స్పందించలేదు. పది గంటలపాటు చికిత్స చేసేందుకు వైద్యులెవరూ అక్కడకు రాకపోవడంతో మృత్యువుతో పోరాడిన శిశువు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

 సీనియర్ ప్రొఫెసర్‌తో విచారణ కమిటీ...
 ఆసుపత్రిలో శిశువు మృతి చెందడం దురదృష్టకరమని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వేణుగోపాలరావు చెప్పారు. దీనిపై సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ సుబ్బారావుతో విచారణ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. 24గంటల్లో కమిటీ నివేదిక అందిస్తుందని, దీని ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఆరా తీశారు. ఆస్పత్రికి వెళ్లి తల్లిదండ్రులు చావలి లక్ష్మి, నాగ దంపతులను పరామర్శించారు.
 
 సిగ్గుతో తలదించుకుంటున్నా..: కామినేని

గుంటూరు: గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల(జీజీహెచ్)లో ఎలుకలు కొరికి శిశువు మృతిచెందడంపై సిగ్గుతో తలదించుకుంటున్నానని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. బుధవారం రాత్రి గుంటూరు జీజీహెచ్‌లో శిశువు మృతిచెందిన వార్డుతోపాటు, మార్చురీలో శిశువు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.    రాష్ట్రంలో మళ్లీ ఇలాంటి సంఘటన జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండేతో మెజిస్టీరియల్ విచారణ, గుంటూరు అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠత్రిపాఠితో పోలీసుల విచారణ, వైద్యారోగ్య శాఖ పరమైన విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. సంఘటన జరిగేందుకు కారకులైన శానిటేషన్ కాంట్రాక్టును పూర్తిగా తొలగించినట్లు చెప్పారు. పారిశుద్ధ్య విభాగం ఇన్‌చార్జి ఆసుపత్రి ఆర్‌ఎంఓతోపాటు, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆసుపత్రిలో శానిటేషన్‌ను మున్సిపల్ కార్పొరేషన్‌కు అప్పగించి మున్సిపల్ కమిషనర్ అనురాధ నేతృత్వంలో పారిశుధ్యం మెరుగు పరుస్తామన్నారు. ఎలుకలు కరిచిన అనేక గంటల వరకు వైద్యులు స్పందించకపోవడంపైనా విచారణ నిర్వహించి, వైద్యుల ప్రమేయం ఉంటే వారిపైనా చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు ఉన్నారు.
 

మరిన్ని వార్తలు