‘సత్యంబాబుకు సంబంధం లేదని ఆనాడే చెప్పాం’

31 Mar, 2017 15:15 IST|Sakshi
‘సత్యంబాబుకు సంబంధం లేదని ఆనాడే చెప్పాం’

గుంటూరు : తమ కు​మార్తె ఆయేషా మీరా హత్యకేసులో సత్యం బాబు ఎలాంటి సంబంధం లేదని తాము ఆనాడే చెప్పామని మృతురాలి తల్లిదండ్రులు అన్నారు. కాగా అప్పట్లో సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా కేసులో శిక్ష అనుభవిస్తున్న సత్యం బాబును హైకోర్టు ఇవాళ (శుక్రవారం) నిర్దోషిగా ప్రకటించింది విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయేషా తల్లిదండ్రులు శంషాద్‌ బేగం, ఇక్బాల్‌ బాషా మాట్లాడుతూ ....నిబద్ధత గల అధికారుల చేత ఆయేషా కేసును రీ ఓపెన్‌ చేయించి విచారణ చేపట్టాలన్నారు.

ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. సత్యంబాబు కుటుంబసభ్యులకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని ఆయేషా తల్లిదండ్రులు సూచించారు. కేసు త్వరగా పరిష్కారం కావాలంటే కోనేరు రంగారావు కుటుంబసభ్యులు, కోనేరు పద్మ, ఐనంపూడి శివరామకృష్ణను విచారణ చేయాలన్నారు.

కాగా 2007లో ఆయేషా విజయవాడ ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రయివేట్‌ హాస్టల్‌లో దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో సత్యంబాబును పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే తన కుమారుడు నిరపరాధి అంటూ అతడి తల్లి హైకోర్టును ఆశ్రయించింది. మరోవైపు ఆయేషా మీరా తల్లిదండ్రులు కూడా తమకు న్యాయం చేయాలని, దోషులను శిక్షించాలంటూ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.
 

>
మరిన్ని వార్తలు