చంద్రబాబు నైజం బయట పడింది : బత్తుల

18 Nov, 2018 08:44 IST|Sakshi

తుళ్లూరు:  రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తు చేయకుండా నియంత్రించే జీవోను తీసుకురావటం ద్వారా చంద్రబాబు నైజం బయట పడిందని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. హత్యాయత్నం తర్వాత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సంపూర్ణమైన ఆరోగ్యంతో కోలుకుని తిరిగి  పాదయాత్ర ప్రారంభించాలని.. వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో ముఖ్యమంత్రి కావాలంటూ పర్చూరు నియోజకవర్గ కార్యకర్తలు చేపట్టిన పాదయాత్ర శనివారం తుళ్లూరు మండల పరిధిలోని పెదపరిమి గ్రామం నుంచి మంగళగిరి మండలం కృష్ణాయపాలెం మీదుగా తాడేపల్లి మండలంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా లింగాయపాలెం గ్రామంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీబీఐ జోక్యం చేసుకుంటే చంద్రబాబు హత్యారాజకీయాలు, రాష్ట్ర ప్రభుత్వ కుంభకోణాలు బయటపడతాయనే భయంతో చట్టం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దేశంలో ఒక భాగమైన ఆంధ్ర రాష్ట్రానికి సీబీఐ రాకుండా చట్టం ఎలా చేస్తారని ప్రశ్నించారు. సీబీఐ విచారణ చేస్తే వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిజాలు బయటపడతాయనేది స్పష్ట మవుతుండడంతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తు తున్నాయన్నారు. బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి నందిగం సురేష్, తుళ్లూరు, ఇంకొళ్లు మండల అధ్యక్షులు బత్తుల కిషోర్, బండారు ప్రభాకర్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కల లక్ష్మీనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 

మరిన్ని వార్తలు