‘బాబుకు ప్రజల ఆకలి కేకలు వినిపించటం లేదా?’

15 Oct, 2018 12:42 IST|Sakshi
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి

సాక్షి, శ్రీకాకుళం : టిట్లీ తుఫాను బాధితులకు న్యాయం జరిగేంతవరకు శ్రీకాకుళం జిల్లాలోనే ఉంటానని చెబుతున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రజల ఆకలి కేకలు వినిపించటం లేదా అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టిట్లీ తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో అపార నష్టం వాటిల్లిందని తెలిపారు. ఇంత భారీ స్థాయిలో నష్టం జరుగుతుందని అంచనా వేసినా.. తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు.

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో జనం కనీసం మంచినీరు కూడా లేకపోవటంతో.. దాహంతో అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగినా, వాటిని తగ్గించేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని మండిపడ్డారు. తమ అనుకూల మాధ్యమాల్లో ఆహా! ముఖ్యమంత్రి ఓహో! అంటూ బయట ప్రపంచానికి ప్రసారం చేసుకుంటున్న అధికార పార్టీ నేతలను ప్రజలు తుఫాను బాధిత ప్రాంతాల్లో అడుగడుగునా నిలదీస్తున్న విషయం కనిపించటం లేదా అంటూ ప్రశ్నించారు. 

మరిన్ని వార్తలు