పట్టపగలే.. నడిరోడ్డుపై హత్యాయత్నం

18 Jul, 2015 02:17 IST|Sakshi
పట్టపగలే.. నడిరోడ్డుపై హత్యాయత్నం

కాపుకాచి దాడికి పాల్పడిన ప్రత్యర్థులు

మదనపల్లె రూరల్: పట్టపగలే నడిరోడ్డుపై ఓ యువకుడిపై మారణాయుధాలతో దాడిచేసి హత్యాయత్నానికి  పాల్పడ్డారు. ఈ సంఘటన శుక్రవారం మదనపల్లె పట్టణంలో సంచలనం కలిగించింది. సంఘటనకు సంబంధించి బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎన్‌వీఆర్ లేఅవుట్‌లో నివాసముంటున్న క్రిష్ణమూర్తి కుమారుడు శశికాంత్(28). బసినికొండ నుంచి ద్విచక్ర వాహనంలో నిమ్మనపల్లె రోడ్డు సర్కిల్‌కు వస్తున్నాడు. ఇంతలో కాపుకాచిన ప్రత్యర్థులు ఎన్‌జేఆర్ కల్యాణ మండపం సమీపంలో రెండు ద్విచక్ర వాహనాల్లో వచ్చి శశికాంత్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నారు. కిందపడిన వెంటనే మారణాయుధాలతో ఒంటిపై పొడిచారు. ఆపై స్థానికుల రాకను గమనించి పరారయ్యారు.

బాధితున్ని స్థానికులు 108లో మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇదిలావుండగా విచారణలో గాయపడిన శశికాంత్ రెండు రోజులక్రితం బర్మావీధిలోని అరుణ్ ఐస్‌క్రీమ్ పార్లల్‌లో గొడవపడ్డట్టు తెలిసింది. ఈ కక్షతోనే దాడికి పాల్పడినట్లు సమాచారం. దాడికి పాల్పడిన వారిలో నగేంద్ర, ఈశ్వర్, ప్రదీప్, కిషోర్ ఉన్నట్లు బాధితుడు తెలిపాడు. వన్‌టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 
 

మరిన్ని వార్తలు