అంతన్నారింతన్నారు..!

1 Mar, 2015 00:13 IST|Sakshi

అంతన్నారు... ఇంతన్నారు... అరచేతిలో స్వర్గం చూపించారు... పల్లెలను భూతల స్వర్గాలుగా మార్చేస్తామని చెప్పారు... సరిగ్గా సమయం వచ్చే సరికి చెవుల్లో ‘కమలం’ పెట్టారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలుగు వారిపై కరుణ చూపలేదని నాయకులు మండి పడ్డారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, చెప్పిన మాటలను పక్కన పెట్టి బడ్జెట్‌ను రూపొందించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస పాటి కేటాయింపులు కూడా చేయకుండా తెలుగు వారికి తీరని అన్యాయం చేశారని అన్నారు.
 
 కార్పొరేట్ సంస్థలకు అనుకూలం...
 కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉన్న బడ్జెట్ ఇది.ఆ సంస్థలకు 30 శాతంగా ఉన్న పన్నును 25 శాతానికి తగ్గించి మేలు కలిగించారు. పేద, మధ్యతరగతి ప్రజలు వినియోగించే వస్తువులపై 12 శాతంగా ఉన్న పన్నును 15శాతానికి పెంచి పేదల నడ్డి విరిచారు. రైతులకు సంబంధించి సబ్సిడీని ఎత్తివేసి నగదు బదిలీ పథకాన్ని తెచ్చారు. మన రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న ప్రత్యేక హోదా, ప్యాకేజీ విషయాన్ని పూర్తిగా విస్మరించారు. గత ఎన్నికల్లో మోదీని కార్పొరేట్ శక్తులు డబ్బులు ఖర్చుచేసి గెలిపించిన రుణాన్ని తీర్చుకునేందుకు కార్పోరేట్ సంస్థలకు అనుకూలంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు
 - పి.కామేశ్వరరావు,
 సీపీఐ జిల్లా కార్యదర్శి
 
 సామాన్యులకు ప్రయోజనం లేని బడ్జెట్
 కేంద్ర ప్రభుత్వం విభజన చట్టాన్ని తుంగలో తొక్కింది. విడిపోయిన ఆంధ్రాకు తగినన్ని నిధులు రాలేదు. పెరిగిన పెట్రో, డీజిల్ ధరలతో సామాన్యులపై భారం పడుతుంది. రాష్ట్రానికి నిరాశే మిగిలింది. ప్రత్యేక హోదా రాలే దు. ప్రత్యేక నిధులూ రాలేదు. విభజన చట్టంలో నాడు పొందుపరిచిన అంశాల సాధనకు, రాష్ట్రాభివృద్ధికి తగిన నిధులు రాబట్టేందుకు ప్రధాని మోదీని తెలుగుదేశం నేతలు కలుస్తాం. కేంద్రంపై ఒత్తిడి పెంచుతాం. చాలా నిరాశజనకంగా ఉన్న బడ్జెట్ ఇది.                                                               
        - కోళ్ల లలితకుమారి, ఎస్.కోట ఎమ్మెల్యే
 
 ఒరిగేదేమీ లేదు
 కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా మన రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదు. రాష్ట్ర విభజన కారణంగా హైదరాబాద్ నగరంతో వచ్చే ఆదాయాన్ని కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ కోసం బడ్జెట్‌లో ఎలాంటి ప్రస్తావన చేయలేదు. ఇది నిరాశ కలిగించింది. వ్యవసాయ రంగానికి సుమారు లక్ష కోట్ల రూపాయలు కేటాయించడం ద్వారా జైట్లీ బడ్జెట్ రైతులకు పెద్ద పీట వేసింది. ముద్ర బ్యాంకును 20వేల కోట్ల రూపాయలతో స్థాపించి చిరు వ్యాపారులు, కుటీర పరిశ్రమల నిర్వాహకులకు తిరిగి రుణాలు ఇచ్చే యోచన హర్షణీయం. బడ్జెట్‌లో పన్ను మార్పులు అంతగా ఆకర్షణీయంగా లేవు.  
 - ఈఆర్ సోమయాజులు,
 ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్
 
 దీర్ఘంగా ఆలోచించాలి
 వృత్తిపై నైపుణ్యంపై కేంద్రమంత్రి శ్రద్ధ కనబరచలేదు. జాతీయ స్థూల ఆదాయ ఉత్పత్తుల్లో సమతౌల్యం పాటించడంలో ఇంకా ఆలోచన చేయాల్సి ఉంది. మంచి బడ్జెట్ ప్రవేశపెట్టాలన్న ఆత్రుతతో కీలక అంశాలను కేంద్ర ప్రభుత్వం విస్మరించింది. విద్య, ఉపాధి, ఆరోగ్యంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన మౌలిక ఆదేశాలు ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులపై పూర్తిస్థాయి పర్యవేక్షణ ఉండాలి. ఈ బడ్జెట్‌తో రాష్ట్రానికి ఒనగూరిన ప్రయోజనం శూన్యమేనని చెప్పాలి. ఇది మన నాయకుల వైఫల్యమే.
 - భీశెట్టి బాబ్జీ,
 రాష్ట్ర కార్యదర్శి,
 లోక్‌సత్తా పార్టీ
 
 ధరల తగ్గింపేదీ..?
 ఇప్పటికే నిత్యావసర సరుకులు, పెట్రో, డీజిల్ ధరలు బాగా పెరిగి ఉన్నాయి. ఈ బడ్జెట్‌తో వాటి ధరలు ఇంకా పెరుగుతాయి. ఇప్పటికే ధరల దడతో ఉన్న ప్రజలకు ఇది చేదు వార్తే. సామాన్యుల కోసం ధరలు తగ్గించే ప్రయత్నాన్ని చేయలేదు. రాష్ట్ర విభజన అనంతరం పూర్తి లోటుతో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన కేంద్రం బడ్జెట్‌లో రాష్ట్రంపై ఏ మాత్రం కనికరం చూపలేదు. కనీస కేటాయింపులు కూడా చేయకపోవడం దారుణం. బీజేపీ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ రాష్ర్టంలో అధికారంలో ఉన్నా సరిపడినన్ని నిధులు రాష్ట్రానికి రాకపోవడం దురదృష్టకరం.
 - పీవీకే మణికుమార్,
 వ్యాపారవేత్త,
  పార్వతీపురం
 
 మాటల గారడీ..
 కేంద్ర ప్రభుత్వం నిరాశాజనకమైన బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. మాటల గారడీయే తప్ప ఎలాంటి స్పష్టతా లేదు. ముఖ్యం గా ఎన్నాళ్ల నుంచో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేస్తామని చెబుతున్నారు. కానీ ఎప్పు డూ దీనిపై నిరాశే మిగులుతోంది. ఆదాయపు పన్ను అంశం ఒక్కటే కాస్త సంతృప్తి కలిగించే అంశం. మిగతా విషయాల్లో అంతా మాటల గారడీతోనే సరిపెట్టేశారు. రా్రష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సాయాన్ని కూడా ప్రకటించకపోవడం దారుణం.                            - ఆర్‌వీఎస్‌కేకే రంగారావు,
  వైఎస్సార్ సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ
 నియోజకవర్గ  ఇన్‌చార్జి
 
 వ్యవసాయ రంగానికేదీ ప్రాధాన్యత?
 కేంద్ర ప్రభుత్వం ప్ర వేశపెట్టిన బడ్జెట్‌లో వ్యవసాయ రం గాన్ని పూర్తిగా విస్మరిం చారు. ఇలాంటి బడ్జెట్‌తో ఇప్పటికే కష్టాల సాగు చేస్తున్న కర్షకులు నిరాసక్తతకు లోనవుతారు.  రాజధాని నిర్మాణానికి  కూడా నిధులు ఇవ్వకపోవడం దారుణం. రాష్ర్ట ప్రభుత్వం కూడా ఈ విషయమై మిన్నకుండిపోవడం మరింత దారుణం.
 - పెనుమత్స సాంబశివరాజు,
 కేంద్ర పాలకమండలి సభ్యుడు,
  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
 
 టీడీపీ విఫలమైంది
 కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడంలో టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కేంద్రప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కూడా నిధులు కేటాయించేలా చేయలేకపోయారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ మాట నిలబెట్టుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం 16వేల కోట్ల లోటులో ఉన్నా అవసరమైన నిధులు మంజూరు చేయలేదు. లక్షకోట్లతో రాజధాని నిర్మాణమన్నారు. దానికి పైసా కేటాయించలేదు. రైల్వే బడ్జెట్‌లో కూడా రాష్ట్రానికి తీరని అన్యాయమే జరిగింది.   
 - పీడిక రాజన్నదొర, ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు
 
 నడ్డి విరిచే బడ్జెట్...
 కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యుడు నడ్డి విరిచే విధంగా ఉంది. పెట్టుబడిదారులకు కొమ్ము కాసే బడ్జెట్‌ను తలపిస్తోంది. సామాన్యుడు వినియోగించే వస్తువులపై ట్యాక్సులు అధికంగా పెంచారు. దేశవ్యాప్తంగా ఆయిల్ ధరలు తగ్గుతుంటే ఏపీలో మాత్రం పెట్రోల్, డీ జిల్ ధరలు విపరీతంగా పెంచేశారు. ప్రభుత్వానికి సంక్షే మం, అభివృద్ధి రెండు కళ్లులా ఉండాలి. అలాంటిది సంక్షేమాన్ని విస్మరిస్తున్నా రు. ఎన్నికలు ముందు తెలుగుదేశం, బీజేపీలు రెండూ కలిసి ఏపీకు ప్రత్యేక హో దా, ప్రత్యేక ప్యాకేజీ కల్పిస్తామని చెప్పారు. ఈ బడ్జెట్‌లో కనీసం ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇవ్వలేదు. తెలుగుదేశం ఎంపీలూ ఏమీ మాట్లాడడం లేదు. కనీసం ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే పరిశ్రమలు అభివృద్ధి చెంది, ఉద్యోగ అవకాశాలు వచ్చేవి. ప్రత్యేక ప్యాకేజీ సాధించుకోవడంలో తెలుగుదేశం ఎంపీలు విఫలమయ్యారు.
 - బెల్లాన చంద్రశేఖర్,
  వైఎస్సార్ సీపీ విజయనగరం పార్లమెంటు పరిశీలకుడు
 

మరిన్ని వార్తలు