డీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్?

2 Dec, 2013 01:52 IST|Sakshi

సాక్షిప్రతినిధి, నల్లగొండ:  జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడిగా ఆలేరు ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ పేరు ఖరారయ్యింది. పార్టీ వర్గాల సమాచారం మేరకు ఆయన నియామకాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. జిల్లా అధ్యక్షుడిగా ఉన్న తూడి దేవేందర్‌రెడ్డి స్వచ్ఛందంగా ఆ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకోవడంతో ఆయన స్థానం ఖాళీ అవుతోంది.

శుక్రవారం దాకా తూడినే కొనసాగించాలని చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదని, దీంతో బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్ పేరు దాదాపు ఖరారు అయ్యిం దని చెబుతున్నారు. గతంలోనూ ఆయన పేరు ఓసారి తెరపైకి వచ్చినా, కార్యరూపం దాల్చలేదు. ఎన్నికల ముందు బీసీ వర్గాలను సంతృప్తిపరచడం, పూర్తిగా జిల్లా కాంగ్రెస్ ‘రెడ్డి’మయం అన్న అపప్రదను తొలగించుకునేందుకు పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. కాగా, ఏఐసీసీ ఆమోదం తర్వాతే భిక్షమయ్య గౌడ్ పేరును  పీసీసీ ప్రకటించే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు