ఎన్నికల వేళ ట్విస్ట్‌.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఇంట్లో ఐటీ సోదాలు

16 Nov, 2023 09:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌/నల్లగొండ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఐడీ దాడులు రాజకీయంగా తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నల్లమోతు భాస్కర్‌ రావు ఇంట్లో, ఆయన బంధువుల నివాసాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏక కాలంలో 40 బృందాలు దాడులు చేస్తున్నాయి. దీంతో, పొలిటికల్‌గా ప్రాధాన్యత సంతరించుకుంది. 

వివరాల ప్రకారం.. మిర్యాలగూడ బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. గురువారం తెల్లవారుజాము నుంచే ఐటీ సోదాలు జరుగుతున్నాయి. మిర్యాలగూడతో పాటు నల్గొండ, హైదారాబాద్‌లోని ఆయన నివాసాల్లో ఏక కాలంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిన్నారు. మొత్తం 40 బృందాలు ఈ దాడుల్లో పాల్గొన్నాయి. నల్లమోతు భాస్కర్ రావుకు దేశ వ్యాప్తంగా పలు వ్యాపారాలు ఉన్నాయి. పవర్ ప్రాజెక్టుల్లో ఆయన పెట్టుబడులు పెట్టినట్లు తెలిసింది. అయితే ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు భారీగా డబ్బు నిల్వచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు సమాచారం అందుకున్న ఐటీ అధికారులు ఆయన ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేశారు.

బంధువుల ఇళ్లలో సోదాలు..
మరోవైపు.. ఆయన బంధువుల ఇళ్లలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. భాస్కర రావు బావమరిది రంగా శ్రీధర్‌తో పాటు మరొక నాలుగు చోట్ల మిర్యాలగూడలో సోదాలు జరుగుతున్నాయి. భాస్కర రావు ప్రధాన అనుచరులు, రైస్‌ మిల్‌ అసోసియేషన్‌ నేతల ఇళల్లో సోదాలు కొనసాగుతున్నాయి. విజయం శ్రీధర్‌, కుశలయ్య ఇళ్లలో కూడా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా.. ఇటీవలే తెలంగాణలో ఎన్నికల సందర్బంగా ఐటీ అధికారులు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనుచరుల ఇళ్లపై కూడా ఇటీవల ఐటీ అధికారులు దాడులు చేశారు. ఈ సోదాల్లో సబితా అనుచరులుగా ప్రచారం జరుగుతున్న నరేందర్ రెడ్డి ఇంట్లో 7.50 కోట్లు, ప్రదీప్ రెడ్డి ఇంట్లో రూ.5 కోట్లకు పైగా డబ్బును ఐటీ అధికారులు సీజ్ చేశారు. ఈ నగదును మహేశ్వరం ఎన్నికల కోసం సమకూర్చుకున్నదిగా ప్రచారం జరుగుతోంది. ప్రదీప్ రెడ్డి, నరేందర్ రెడ్డికి మంత్రి సబితా కుమారుడితో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా ఐటీ అధికారులు విచారణలో గుర్తించారు. అటు, పొంగులేటి ఇంట్లో కూడా ఐటీ దాడులు జరిగాయి. 

మరిన్ని వార్తలు